సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన పలువురు మరణించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) నిర్ణయించింది. ఈ దుర్ఘటన కారణంగా విద్యానగర్కు చెందిన నజీరుద్దీన్ కుటుంబం మొత్తం 18 మందిని కోల్పోవడం అత్యంత విషాదకరం. ఈ మేరకు మృతుల కుటుంబాలకు కేబినెట్ సంతాపం తెలియజేసింది. ఈనెల 9న హైదరాబాద్ నుంచి నాలుగు వేర్వేరు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా సుమారు 45 మంది యాత్రికులు ఉమ్రా యాత్ర (Umrah Pilgrimage) కోసం సౌదీ అరేబియాకు బయలుదేరారు.
వీరంతా విజయవంతంగా మక్కా యాత్ర పూర్తి చేసుకుని, అక్కడి నుంచి మదీనాకు వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. మదీనాకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో వీరి బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలంగాణ హజ్ కమిటీ అధికారిక ప్రకటనలో తెలిపింది. మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. ఈ మృతులంతా హైదరాబాద్ వాసులే కావడం నగరంలో విషాదఛాయలను నింపింది. తెలంగాణ ప్రభుత్వం ఈ దుర్ఘటనపై స్పందించి, మృతుల కుటుంబాలకు అండగా నిలబడింది.
మక్కాలో ఘోర బస్సు ప్రమాదం.. మృతుల్లో 16 మంది హైదరాబాద్ వాసులు
ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి, మృతదేహాల తరలింపును పర్యవేక్షించడానికి మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది. బాధిత కుటుంబాల నుంచి ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పున సభ్యులను సౌదీకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వమే చేయాలని నిర్ణయించింది.
చనిపోయిన వారి మృతదేహాలకు వారి మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ బృందానికి సూచించింది. సౌదీ అరేబియాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa