తెలంగాణలో మరో దళిత యువకుడి అనుమానాస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలోకి తీసుకుని, తీవ్రంగా హింసించడంతోనే అతను మరణించాడని కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కోదాడలోని కల్లుగడ్డ బజారులో నివాసముండే కర్ల రాజేష్ (30) అనే దళిత యువకుడు అనారోగ్య సమస్యల చికిత్స ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు.
మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేష్ పేరు మీద రూ. 1 లక్ష మంజూరైనట్లు, ఆ చెక్కును దొండపాడు ప్రాంతానికి చెందిన చెడపంగు నరేష్ అనే వ్యక్తి కాజేశాడని తెలిపారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ రాజేష్ స్థానిక కోదాడ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడైన రాజేష్కు న్యాయం చేయాల్సింది పోయి, పోలీసులు అతన్నే కస్టడీలోకి తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సహా పలువురు సిబ్బంది రాజేష్ను అదుపులోకి తీసుకుని 4 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తీవ్ర గాయాలు, అనారోగ్యంతో ఉన్న రాజేష్ను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, రిమాండ్ నిమిత్తం హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించారు. జైలుకు వెళ్లినప్పటి నుంచి రాజేష్ తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధపడటంతో జైలు సిబ్బంది అతనిని తిరిగి పోలీసులకు అప్పగించారు. అస్వస్థతతో బాధపడుతున్న రాజేష్ను ముందుగా జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అతని పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజేష్ను హైదరాబాద్కు తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే అతను మృతి చెందాడు.
తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినందుకు, కస్టడీలో చిత్రహింసలు పెట్టి తన తమ్ముడి చావుకు పోలీసులు కారణమయ్యారని రాజేష్ సోదరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయం బయటికి రాకుండా కోదాడ డీఎస్పీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని, కేసును పక్కదారి పట్టిస్తున్నారని రాజేష్ కుటుంబం ఆరోపిస్తోంది. రాజేష్ మృతికి కారణమైన పోలీసు అధికారులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని, అతని కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa