ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో జీఎంఆర్ అతి పెద్ద శాఫ్రాన్ ఎయిర్ పార్క్ సెజ్,,,,రూ.1300 కోట్లతో దేశంలోనే తొలి కేంద్రం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 07:43 PM

విమానయాన రంగంలో హైదరాబాద్ ‌‌ను మరింత అభివృద్ధి చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా నగరంలో ఏర్పాటు చేసిన అతి పెద్ద జీఎంఆర్ శాఫ్రాన్ ఎయిర్‌పార్క్ సెజ్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత పీఎం మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.


మోదీ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన శాఫ్రాన్‌ సంస్థకు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. ఇండియా కూడా ఇప్పటికే 1500 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్‌ ఇచ్చిందన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల సర్వీస్‌ సెంటర్‌ ఇండియాలో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరం అన్నారు. తమ ప్రభుత్వం దేశంలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉందని.. అందుకోసం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలానే కొన్ని రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.


నగరంలోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రీయల్ పార్క్ సెజ్‌లో ఏర్పాటు చేసిన శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా అనేది.. లీడింగ్‌ ఎడ్జ్‌ ఏవియేషన్‌ ప్రొపల్షన్‌(ఎల్ఈఏపీ-లీప్) ఇంజిన్‌ల కోసం కేటాయించిన ఒక ప్రత్యేక మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) కేంద్రం. ఈ లీప్ ఇంజిన్‌లు ఎయిర్‌బస్ A320 నియో, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు శక్తిని అందిస్తాయి అంటున్నారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం.. ఏరోస్పేస్, రక్షణ రంగంలో రాష్ట్ర వృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన కేంద్రం..భారతదేశంలో లీప్ ఇంజిన్‌ల మొట్టమొదటి ఎంఆర్ఓ కేంద్రం అని చెప్పుకొచ్చారు. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వల్ల 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉపాధి లభిస్తుందన్నారు.హైదరాబాద్ భారతదేశంలోనే.. అత్యంత ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా నిలుస్తుందన్నారు. తెలంగాణలో సుమారు 25 కన్నా ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలతో పాటుగా 1,500 కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa