ఖమ్మం నగరంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అమరగానాన్ని భక్తి శ్రద్ధలతో జ్ఞాపకం చేసే ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ‘భలే మంచి రోజు’ ఈ ఏడాది 29వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. సుధాస్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో గత 28 ఏళ్లుగా నిర్విరామంగా జరుగుతున్న ఈ సంగీతోత్సవం ప్రతి సంవత్సరం లక్షలాది ఘంటసాల అభిమానులకు సంగీత పరవశాన్ని అందిస్తోంది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో డిసెంబర్ 7వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 గంటల నుంచి భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ మహోత్సవం ఘనంగా ప్రారంభం కానుంది.
ఈసారి కార్యక్రమం మరింత భావోద్వేగభరితంగా సాగబోతోంది. ఎందుకంటే ఈ గానామృత వేడుకలకు గత ఎన్నో సంవత్సరాలుగా కోఆర్డినేటర్గా అనిర్వచనీయ సేవలందించిన పంచాంగం విజయసారధి ఇటీవల మరణించారు. ఆయన ఆశయాలకు, ఘంటసాల సంగీత ప్రేమకు నివాళిగా ఈ 29వ వార్షికోత్సవాన్ని ఆయన స్మృత్యర్థంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ నేతలు తెలిపారు. విజయసారధి లేకుండా జరగబోయే మొదటి వేడుక కావడంతో అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంది.
సుధాస్ ఎంటర్టైన్మెంట్స్ అధ్యక్షులు డాక్టర్ వాసుదేవ్, ప్రధాన కార్యదర్శి శఠగోపం సుదర్శన్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఘంటసాల గారి ఎన్నో అపూర్వ గీతాలు, భక్తి పాటలు, జానపద గీతాలతో కూడిన రిహార్సల్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయని, ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులు పాల్గొనబోతున్నారని వారు చెప్పారు.
ఖమ్మం ప్రజలకు డిసెంబర్ మొదటి ఆదివారం అంటే ‘భలే మంచి రోజు’నే అనిపించేలా మారిన ఈ సంగీత సంధ్య ఈసారి విజయసారధి స్మృతులతో మరింత ఘనంగా నిర్వహించబోతోంది. ఘంటసాల అభిమానులందరూ ఈ గానామృతాన్ని స్వీకరించేందుకు డిసెంబర్ 7 సాయంత్రం భక్త రామదాసు కళాక్షేత్రానికి తప్పక రావాలని సంస్థ కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa