ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ నిర్మాణాలను నేలమట్టం.. ఆ ఏరియాల్లోనే భారీగా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 07:19 PM

ఎన్నిసార్లు చెప్పినా వినరు.. మాకెవరు అడ్డురాగలరు అన్నట్లుగా కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను, నీటి వనరుల ఆక్రమణకు ప్రయత్నిస్తుంటారు. అధికారుల అండదండలు ఉన్నాయన్న ధీమాతో.. చట్టాలను ఏమాత్రం లెక్కచేయకుండా అక్రమ కట్టడాలను నిర్మిస్తుంటారు. ఇటువంటి వాటిని అధికారులు ఉపేక్షించరు. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై ఉక్కుపాదం మోపుతూ.. తాజాగా రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు భారీగా కూల్చివేతలు చేపట్టారు.


తెలంగాణలో ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడేవారిపై రెవెన్యూ అధికారులు తమ దూకుడును పెంచారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన కూల్చివేతలు ఈ తీవ్రతను తెలియజేస్తున్నాయి. కాప్రా తహసీల్దార్ రాజేష్ ఆధ్వర్యంలో పలు సర్వే నెంబర్లలోని అక్రమ కట్టడాలను పోలీస్ పహారా మధ్య నేలమట్టం చేశారు.


సర్వే నెం. 376, 377, 293, 202, 203/1, 710, 421, 812 వంటి కీలకమైన ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేష్ మాట్లాడుతూ.. జవహర్ నగర్ కార్పొరేషన్‌లోని సర్కారు భూముల్లో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టరాదని.. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు రమేష్, సత్యనారాయణ, జవహర్ నగర్ ఎస్సైలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


కూకట్‌పల్లి నల్ల చెరువులో ఉద్రిక్తత..


మరోవైపు.. కూకట్‌పల్లిలోని నల్ల చెరువు పరిరక్షణలో భాగంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న గుడిసెలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేత సందర్భంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ గుడిసెలను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూలుస్తున్నారంటూ స్థానికులు హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తాము దళితులమని.. గత 50 ఏళ్లుగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్నామని.. ఇది తాత ముత్తాతల నుంచి వస్తున్న ప్రభుత్వ భూమి అని.. ఇది ప్రభుత్వానికి సంబంధించి కాదనీ స్థానికులు ఆందోళనకు దిగారు.


తమ భూములను లాక్కుంటే ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నల్ల చెరువులో కూల్చివేతల భయంతో బుచ్చమ్మ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ.. హైడ్రా సిబ్బందిని నిలదీశారు. అయితే.. స్థానికుల ఆందోళన ఉన్నప్పటికీ.. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు కూల్చివేత ప్రక్రియను కొనసాగించి.. గుడిసెలను తొలగించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa