ట్రెండింగ్
Epaper    English    தமிழ்

18 ఏళ్లు నిండి.. రేషన్ కార్డు ఉన్న ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 05, 2025, 07:40 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు రేషన్ కార్డుల జారీ.. అలాగే 18 ఏళ్లు నిండిన మహిళలకు చీరల పంపిణీపై దృష్టి సారించారు. 'ప్రజా పాలన విజయోత్సవాల'లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సంక్షేమ కార్యక్రమాలపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 1.10 కోట్ల రేషన్ కార్డుల ద్వారా దాదాపు 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.


దీని ద్వారా పేదల ఆకలిని తీరుస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించి.. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించే ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండి.. రేషన్ కార్డులు ఉన్న ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తుందన్నారు. ఇప్పటికే చాలా వరకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.


 వీరిలో డ్వాక్రా గ్రూపుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఉంటే చీరలను పంపిణీ చేశారు. ఇక నుంచి ఈ విధంగానే పంపిణీ చేయనున్నారు. ఆధార్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఉంటే సరిపోతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడిందని.. ఎన్నికల ముగిసిన వెంటనే పంపిణీ చేస్తామన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో మార్చి 1వ తేదీ నుంచి ఇందిరమ్మ చీరలను పంచుతామన్నారు.


ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు బంద్ అవుతుందని గత ప్రభుత్వం దుష్ప్రచారం చేసిందని సీఎం గుర్తు చేశారు. అయితే.. తమ ప్రభుత్వం గత సీజన్‌లో 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లను 'రైతు భరోసా' కింద రైతులకు అందించింది. వరి సాగును ప్రోత్సహిస్తూ.. రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చారు. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రేవంత్ రెడ్డి తెలిపారు.


వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌పై పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకున్న వారి పవర్ మాత్రమే కట్ అయిందని సీఎం విమర్శించారు. వరంగల్‌ జిల్లా అభివృద్ధి కోసం రూ. 532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వరంగల్‌కు విమానాశ్రయం సాధిస్తామని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో ఒక్క కొత్త ఎయిర్‌పోర్టును కూడా సాధించలేకపోయారని మాజీ ముఖ్యమంత్రిని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa