ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కేంద్రంపై జగ్గారెడ్డి ఆగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 17, 2025, 08:33 PM

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని చూస్తోందంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కేవలం గాంధీ, నెహ్రూలను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని, వారి పేర్లను చరిత్ర నుంచి చెరిపేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈరోజు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీజేపీ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.మోదీ, అమిత్ షాలు పుట్టకముందే, 1930లోనే గాంధీజీ 'రఘుపతి రాఘవ రాజారాం' అంటూ సత్యాగ్రహం చేశారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. ప్రజలను ఏకం చేయడానికి గాంధీ రాముడి పేరు వాడితే, బీజేపీ మాత్రం అదే పేరుతో ప్రజలను విభజిస్తోందని విమర్శించారు. "గాంధీ, నెహ్రూ మీలా క్రిమినల్స్ కాదు. దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైలు జీవితం గడిపారు. అలాంటి వారిపై ఇప్పుడు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వ కుట్రలకు నిరసనగా త్వరలో సంగారెడ్డిలో లక్ష మందితో భారీ నిరసన సభ నిర్వహిస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. మోదీ పాలనలో పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, రైతులు, యువతను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రజలు ఏదో ఒకరోజు రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తారని, అప్పుడు బీజేపీ నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అయ్యాక ఈడీ, సీబీఐ వంటి సంస్థలు మీ మాట వింటాయా అని నిలదీశారు. అధికారం శాశ్వతం కాదని, బీజేపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa