మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని, ఎరువులు, విత్తనాలు నేరుగా రైతుల ఇంటికి లేదా చేను వద్దకే వచ్చేవని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పరిస్థితి పూర్తిగా దిగజారిందని, ఒక్క బస్తా యూరియా కోసం రైతుల కుటుంబాలు మొత్తం క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలను గోసపెడుతున్న ఈ ప్రభుత్వ తీరు మార్చుకోవాలని, లేకపోతే రైతాంగ ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ఒక్క కొత్త పథకాన్ని కూడా ఇప్పటివరకు ప్రకటించలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కొత్త పథకాలు తీసుకురావడం పక్కన పెడితే, గత ప్రభుత్వం ప్రజల కోసం విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను అటకెక్కించడం, నిధులు ఆపేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. పాలనపై పట్టులేక, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యలకే ఈ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి, అస్తవ్యస్త విధానాల వల్ల ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా పడిపోయిందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ కృషితో పెరిగిన భూముల ధరలు, స్థిరాస్తి విలువలు నేడు కాంగ్రెస్ పాలనలో అమాంతం తగ్గిపోయాయని, దీనివల్ల సంపద ఆవిరైపోతోందని పేర్కొన్నారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు, రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పెట్టుబడులు వెనక్కి పోయే పరిస్థితి వచ్చిందని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోందని, ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యవసాయానికి సాగునీరు అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో వాగులపై నిర్మించిన చెక్డ్యామ్లను ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా పేల్చివేస్తున్నారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్న ఈ చర్యలు అత్యంత హేయమని, ఇది అన్నదాతల పొట్టకొట్టడమేనని నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసి, కట్టిన కట్టడాలను కూల్చడం ఏ రకమైన పాలన అని ప్రశ్నించారు. ఈ విధ్వంసకర చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ సమావేశంలో స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa