తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ రంగ కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇచ్చే కరువు భత్యం (DA) పెంపు ప్రతిపాదనలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరనుంది.
సాధారణంగా ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ధరల సూచీని బట్టి కరువు భత్యాన్ని సమీక్షిస్తారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఈ పెంచిన డీఏ జూలై 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పంపిన 17.651 శాతం పెంపు ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం తుది ఆమోదం ముద్ర వేశారు. ఈ తాజా ఉత్తర్వుల వల్ల తెలంగాణలోని నాలుగు ప్రధాన విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 71,387 మంది లబ్ధి పొందుతారు. సంస్థల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి..
సంస్థ పేరు ఉద్యోగులు ఆర్టిజన్లు పెన్షనర్లు మొత్తం లబ్ధిదారులు
టీజీ ట్రాన్స్కో 3,036 3,769 2,446 9,251
టీజీ జెన్కో 6,913 3,583 3,579 14,075
ఎస్పీడీసీఎల్ 11,957 8,244 8,552 28,753
ఎన్పీడీసీఎల్ 9,728 3,465 6,115 19,308
మొత్తం 31,634 19,061 20,384 71,387
ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉద్దేశం..
బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు , పదవీ విరమణ పొందిన పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడటమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఆర్టిజన్లకు ఈ పెంపు వల్ల జీతాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫైలుపై మంత్రి సంతకం చేశారు.
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డీఏ అంశం కొలిక్కి రావడంతో విద్యుత్ ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జూలై 2025 నుంచి వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వడం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. 71 వేల మందికి పైగా కుటుంబాల్లో ఈ నిర్ణయం వెలుగులు నింపిందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa