ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేటు భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఖాళీ,,,కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 22, 2025, 07:55 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించే దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ప్రైవేటు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా నిర్ణయిస్తూ.. కొత్త ఏడాది నుంచి పరిపాలన అంతా సొంత భవనాల్లోనే సాగాలని ఆదేశించారు.


ప్రభుత్వ నిర్ణయం కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా.. కఠినమైన ఆర్థిక నిబంధనలను కూడా విధిస్తోంది. డిసెంబర్ 31 లోపు ప్రైవేటు భవనాలను ఖాళీ చేసి.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోకి మారాలి. ఫిబ్రవరి 1 నుంచి ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లింపులను నిలిపివేయాలని ట్రెజరీ విభాగానికి సర్క్యులర్ జారీ అయింది. గడువు దాటిన తర్వాత కూడా అద్దె భవనాల్లోనే కొనసాగితే... ఆ అద్దెను సంబంధిత శాఖాధికారి తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించాల్సి ఉంటుంది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీగా భవన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ తన కార్యాలయాలన్నింటినీ అమరావతి, విజయవాడకు తరలించడంతో రాజధానిలో కీలకమైన భవనాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం పరిశ్రమ భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్, బీఆర్కే భవన్ , ఎర్రమ్ మంజిల్ వంటి ప్రతిష్టాత్మక భవనాల్లో తగినంత స్థలం అందుబాటులో ఉంది. ప్రభుత్వ విభాగాలే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు కూడా ఈ నిబంధనను పాటించాల్సి ఉంటుంది.


ప్రతి ఏటా ప్రభుత్వం అద్దె రూపంలో కోట్లాది రూపాయలను ప్రైవేటు భవన యజమానులకు చెల్లిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయం వృధా కాకుండా కాపాడవచ్చు. సొంత భవనాలు ఖాళీగా ఉండగా.. అద్దె భవనాల కోసం ప్రజా ధనాన్ని వెచ్చించడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది అన్ని కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోకి మారడం వల్ల ప్రజలకు కూడా ఒకే ప్రాంగణంలో వివిధ సేవలందే అవకాశం ఉంటుంది. అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, విభాగాధిపతులు వెంటనే తమకు అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించి.. బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ కె.రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క ప్రభుత్వ బోర్డు కూడా ప్రైవేటు భవనంపై కనిపించకూడదన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనపడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa