హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ ఇప్పుడు మాదకద్రవ్యాల మాఫియాకు అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో వెలుస్తున్న విలాసవంతమైన కో లివింగ్ వసతి గృహాలు నేరాలకు కేంద్రీకృతమవుతున్నాయి. సమాచార సాంకేతిక రంగంలో పనిచేస్తూ భారీ జీతాలు తీసుకునే యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా రాయదుర్గం పరిధిలో జరిగిన దాడులు ఈ చీకటి వ్యాపారాన్ని మరోసారి బయటపెట్టాయి.
రాయదుర్గం అంజయ్య నగర్లోని కో లివ్ గెర్నట్ పీజీ హాస్టల్లోడ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయని అందిన సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వంశీ దిలీప్, బాల ప్రకాష్ అనే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మత్తు పదార్థాలు వినియోగిస్తున్న మణికంఠ, రోహిత్, తరుణ్ అనే ముగ్గురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్ రకం గంజాయి, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. మాదకద్రవ్యాల సరఫరాదారులు తెలివిగా సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసే వారిని ఎంచుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఈ రంగంలో పనిచేసే వారికి జీతాలు ఎక్కువగా ఉండటంతో.. ఖరీదైన డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వారు వెనకాడటం లేదు. ఒక్కో గ్రాము వేల రూపాయలు ఉన్నా కొనేందుకు సిద్ధపడుతున్నారు.
కో లివింగ్ హాస్టల్స్ లో ఉండే స్వేచ్ఛ, ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ తీసుకునేందుకు వీలు కల్పిస్తోంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం లేదా విలాసం కోసం యువత ఈ మత్తు ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ బలహీనతనే పెడ్లర్లు తమ పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. ఈ పెరుగుతున్న మత్తు సంస్కృతిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది.
ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో విభాగం ఐటీ కారిడార్లోని హాస్టళ్లపై నిరంతర నిఘా ఉంచింది. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే ఉద్యోగాలు పోవడమే కాకుండా.. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన పాస్పోర్ట్ క్లియరెన్స్ కూడా దక్కదని హెచ్చరిస్తోంది. వసతి గృహాల్లో ఇలాంటి కార్యకలాపాలు సాగితే యజమానులదే బాధ్యతని. వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఐటీ కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపి, ఉద్యోగుల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa