తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణ సౌకర్యాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 'తెలంగాణ రైజింగ్ విజన్-2047' పేరుతో రూపొందించిన ఈ బృహత్తర ప్రణాళిక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,800 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేలు, సరికొత్త గ్రీన్ ఫీల్డ్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి రోడ్లు, భవనాల శాఖ ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించింది.
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయడానికి, నిధుల సమీకరణ మార్గాలను అన్వేషించడానికి ప్రభుత్వం 'రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్' పత్రాన్ని తయారు చేస్తోంది. దీని పర్యవేక్షణ బాధ్యతను రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఒక ఉన్నత స్థాయి కమిటీకి అప్పగించారు. ఈ కమిటీలో ఆర్థిక శాఖ, జాతీయ రహదారుల విభాగానికి చెందిన కీలక అధికారులు సభ్యులుగా ఉండి.. సాంకేతిక, ఆర్థిక పరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తారు.
ప్రస్తుతం తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో సుమారు 46 వేల కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. అయితే.. రాబోయే రెండు దశాబ్దాలలో దీనిని ఏకంగా 1,15,000 కిలోమీటర్లకు పెంచాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. నిధుల కొరత లేకుండా పనులు సాగడానికి ప్రభుత్వం 'హైబ్రిడ్ యాన్యుటీ మోడ్' అనే కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతుంది. కేవలం రోడ్లు వేయడమే కాకుండా.. ప్రమాదాలను తగ్గించడానికి 'స్మార్ట్ మొబిలిటీ' పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. రహదారుల వెంట అత్యాధునిక లైటింగ్, సీసీ కెమెరాలు, అత్యవసర సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలను అనుసంధానించేలా కొన్ని భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ - బెంగళూరు.. సుమారు 5,221 కోట్ల రూపాయలతో ఈ మార్గాన్ని ఎక్స్ ప్రెస్వేగా మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ - విజయవాడ.. ప్రస్తుతం ఉన్న 4 వరుసల రహదారిని 6 వరుసలకు విస్తరించి, 9,090 కోట్ల రూపాయలతో ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ - శ్రీశైలం మార్గంలో 150 కిలోమీటర్ల దూరాన్ని 4 వరుసలకు విస్తరించనున్నారు. నాగ్పూర్ - హైదరాబాద్.. దాదాపు 397 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారిగా దీనిని తీర్చిదిద్దనున్నారు. ఫ్యూచర్ సిటీ - మచిలీపట్నం.. కొత్తగా నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు 234 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రానుంది.
కొత్తగా నిర్మించే రహదారుల వల్ల పర్యావరణానికి నష్టం కలగకుండా ప్రభుత్వం 'గ్రీన్ హైవేస్' విధానాన్ని అవలంబిస్తోంది. రోడ్లకి ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు.. వర్షపు నీటిని నిల్వ చేసే వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే.. జిల్లాల పరిధిలోని గ్రామాలను ప్రధాన రహదారులతో కలపడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి రాజధాని హైదరాబాద్కు చేరుకునే సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టుల కోసం సుమారు 29,057 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే, తెలంగాణ రవాణా రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa