సంగారెడ్డి జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి జాతర నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అధికారికంగా ప్రకటించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ జాతర ఏర్పాట్లపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావుతో కలిసి కలెక్టర్ ప్రావిణ్య వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు మరియు పారిశుధ్యం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని సూచించారు. జాతర జరిగే తొమ్మిది రోజుల పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను కోరారు.
ముఖ్యంగా అమృత గుండంలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో లైటింగ్, వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ మరియు మున్సిపల్ శాఖలకు సూచనలు జారీ చేశారు. అలాగే, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను నడపాలని, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
జాతరకు వచ్చే ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం ప్రశాంతంగా లభించేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు యంత్రాంగం వెల్లడించింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో భక్తులకు సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, ప్రసాదం పంపిణీలో నాణ్యత పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయాన్ని అలంకరించడంతో పాటు, భారీ బందోబస్తు మధ్య ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులందరికీ దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa