కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పద్మ పురస్కారాల్లో తెలంగాణకు చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు లభించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 131 మందికి పురస్కారాలు ప్రకటించగా, అందులో తెలంగాణ నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి సముచిత స్థానం దక్కడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు.ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ సైన్స్, వైద్యం, కళలు, పశుసంవర్ధక వంటి భిన్న రంగాల్లో తెలంగాణ ప్రతిభ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో చంద్రమౌళి గడ్డమానుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్, కుమారస్వామి తంగరాజ్లకు; వైద్య రంగంలో డాక్టర్ గూడూరు వెంకట్ రావు, డాక్టర్ పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డిలకు, కళల విభాగంలో కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి పద్మశ్రీలు దక్కాయని గుర్తుచేశారు. పశుసంవర్ధక రంగంలో విశేష సేవలు అందించిన మామిడి రామారెడ్డికి మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడం ఆయన నిస్వార్థ సేవకు దక్కిన నిజమైన గౌరవమని అభిప్రాయపడ్డారు.క్షేత్రస్థాయిలో నిశ్శబ్దంగా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి గౌరవించడం అభినందనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పురస్కారాలు కేవలం వ్యక్తులకు దక్కిన గౌరవంగానే కాకుండా, రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని ఆకాంక్షించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిభావంతులు తమ తమ రంగాల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పురస్కార గ్రహీతలందరికీ, వారి కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa