నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన జానపాటి కోటేష్ (33) అనే యువకుడు తన నివాసంలో అత్యంత దారుణమైన స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడి గొంతుపై తీవ్రమైన గాయాలు ఉండటంతో ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో గ్రామంలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
కుటుంబ కలహాలే ఈ ఘటనకు నేపథ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆరు నెలలుగా కోటేష్ భార్య హేమలత తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లి అక్కడే నివసిస్తోంది. ఈ క్రమంలో కోటేష్ ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడు. గురువారం ఉదయం ఎంతకీ అతను బయటకు రాకపోవడం, అనుమానాస్పద శబ్దాలు గమనించిన పొరుగువారు లోపలికి వెళ్లి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న కోటేష్ను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఘటన గురించి తెలుసుకున్న భార్య హేమలత హుటాహుటిన గ్రామానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తన భర్త మరణానికి గల కారణాలను నిగ్గుతేల్చాలని ఆమె పోలీసులను కోరారు. ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదభరితంగా మారింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఇది పాత కక్షల వల్ల జరిగిన దాడియా లేక కుటుంబ సమస్యల వల్ల తీసుకున్న తీవ్ర నిర్ణయమా అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాక స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మిస్టరీ డెత్ పెద్దగూడెం గ్రామస్తులను భయాందోళనలకు గురిచేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa