తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు నేరుగా ప్రచార రంగంలోకి దిగుతుండటంతో మున్సిపల్ ‘పోల్స్’ సందడి ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తూ, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రాబోయే కొద్దిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు, రోడ్ షోలతో రాజకీయ కోలాహలం నెలకొననుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. రేపు మిర్యాలగూడలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభతో ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ప్రతిరోజూ ఒక్కో నియోజకవర్గంలో సభలు నిర్వహించేలా సీఎం షెడ్యూల్ ఖరారైంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందనే సందేశాన్ని ఆయన బలంగా వినిపించనున్నారు.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ప్రచారంలో జోరు పెంచుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు హరీష్ రావు కలిసి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పలు మున్సిపాలిటీల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించారు. కేడర్లో ఉత్సాహం నింపుతూ, క్షేత్రస్థాయిలో ఓటర్లతో మమేకమవుతూ గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వారు వ్యూహరచన చేస్తున్నారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీ తనకు పట్టున్న ఉత్తర తెలంగాణ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీ, ఈసారి జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించుతోంది. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది. హిందుత్వ ఎజెండాతో పాటు కేంద్ర నిధుల వినియోగం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa