ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 03:21 PM

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి, అన్ని పట్టణాలపై గులాబీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమై ప్రజలను మోసం చేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌కు అనుకూల వాతావరణం ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. వచ్చే వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయని, అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు కేవలం ఏడెనిమిది స్థానాలకే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. ఎన్నికల వ్యూహంలో సమన్వయం అత్యంత కీలకమని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ విజ్ఞప్తిని మన్నించి నామినేషన్లు ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి త్యాగం చేసిన ప్రతి నాయకుడి ఇంటికీ అభ్యర్థులు స్వయంగా వెళ్లి, వారిని ప్రచారంలో భాగస్వాముల్ని చేయాలన్నారు. వారికి తగిన గౌరవం ఇచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన బాధ్యత మున్సిపల్ సమన్వయకర్తలపై ఉందని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa