ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే.. అక్బరుద్దీన్ ఓవైసీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 09:29 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుత, గత ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ.. ప్రచారం ముగింపు రోజున కరీంనగర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రుల వద్దకు తాము వెళ్లం అని.. వాళ్లే తమ వద్దకు వస్తారని పేర్కొన్నారు. అది రెడ్డి అయినా.. రావు అయినా తమ దగ్గరికి రావాల్సిందేనని తేల్చి చెప్పారు.


తాము ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని.. పనులు కావాలన్నా, అధికారం కావాలన్నా సీఎంలే తమ వద్దకు రావాల్సి ఉంటుందని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. తమ సపోర్ట్ లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ మద్దతు అనేది రాష్ట్రంలో కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని పేర్కొన్న అక్బరుద్దీన్ ఓవైసీ.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమ పార్టీకి ఉందని తెలిపారు.


ఇక కొన్ని నెలల క్రితం జరిగిన జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో తమ మద్దతు లేకుండానే కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందా అని అక్బరుద్దీ్న్ ఓవైసీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ సాధించిన విజయంలో ఎంఐఎం పాత్ర కీలకమని.. దాన్ని హస్తం పార్టీ నేతలు మర్చిపోకూడదని పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ ఎంఐఎం పార్టీ అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ.. ఎంఐఎం బ్రదర్స్‌ (అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ) సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు.


గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎంఐఎం పార్టీ కింగ్ మేకర్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా అద్భుత ప్రతిభ కనబరుస్తారని పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తమ పార్టీ బలం ఏంటో ప్రత్యర్థులకు చూపిస్తామని ఎంఐఎం కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి.. అత్యధిక వార్డులను దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa