ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 06:25 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్నెండేళ్ల బీజేపీ, పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.మనం కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి ఇస్తే, తిరిగి మనకు 42 పైసలే ఇస్తున్నారు. అదే ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్‌కు రూ.6.06, యూపీకి రూ.2.90 ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ఈ వివక్ష ఎందుకని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎప్పుడైనా మోదీని ప్రశ్నించార అని నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని 2014లో హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వరద బాధితులకు కారుకు కారు, బైకుకు బైకు ఇస్తామని చెప్పిన బీజేపీ నేతలు, ఆ తర్వాత ఆ హామీని గాలికొదిలేశారని విమర్శించారు. గల్లీ ఎన్నికకు ప్రధాని మోదీకి ఏం సంబంధం ఆయనేమైనా వచ్చి మోరీలు తీస్తారా అంటూ ఎద్దేవా చేశారు.గత పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.పదేళ్ల పాటు సర్పంచ్ నుంచి మున్సిపల్ వరకు పెత్తనం చెలాయించి, సమస్యలకు కారణమైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే ఇప్పుడు పరిష్కరిస్తామని చెప్పడం హాస్యాస్పదం. అహంకారంతో గంజాయి, కొకైన్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్లు దోచుకున్నారు. విచారణకు పిలిస్తే ముసుగులు వేసుకుని వెళ్తున్నారు అని తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలది 2023 వరకు విడదీయలేని బంధమని, నోట్ల రద్దు నుంచి రైతు చట్టాల వరకు అన్నింటికీ బీఆర్ఎస్ మద్దతిచ్చిందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను అరెస్టు కాకుండా బీజేపీనే కాపాడుతోందని, యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన బీఆర్ఎస్ పీడ వదలదని సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక హామీలను నెరవేర్చిందని రేవంత్ రెడ్డి వివరించారు.ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రైతు రుణమాఫీ పూర్తి చేసి, వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.5 లక్షల సాయం అందిస్తున్నాం అని తమ ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ సమస్యలకు పరిష్కారం చూపించామని తెలిపారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడతామని స్పష్టం చేసిన సీఎం, మరో ఎనిమిదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదించి గెలిపిస్తే, అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa