'వందేమాతరం' గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. 'జనగణమన' వంటి జాతీయ గీతాల కంటే ముందు దీనిని కచ్చితంగా ఆలపించాలని ఈ నిబంధనలలో పేర్కొంది. వందేమాతర గీతం ఆలపించినప్పుడు అందరూ నిలబడాలని పేర్కొంది.అన్ని పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఈ నిబంధనల్లో పేర్కొంది. జాతీయ గీతం, గేయం పాడుతుండగా అంతరాయం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. తాజాగా విడుదల చేసిన నిబంధనల కింద బాధ్యులకు గరిష్ఠంగా మూడేళ్ళ జైలు శిక్ష విధించనున్నట్లు స్పష్టం చేసింది. సినిమా హాల్స్ వంటి ప్రదేశాల్లో కూడా దీనిని తప్పనిసరి చేసింది. ఈ సందర్భాల్లో నిలబడటాన్ని తప్పనిసరి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త నిబంధనలను విడుదల చేసింది. 1937లో తొలగించిన నాలుగు చరణాలతో కలిపి మొత్తం ఆరు చరణాలను పాడాలని కేంద్రం వెల్లడించింది. స్వాతంత్ర పోరాట సమయంలో ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు నాలుగు చరణాలను తొలగించిన కాంగ్రెస్, రెండు చరణాలను స్వీకరించింది. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వం రెండు చరణాలతోనే 'వందేమాతరం'ను జాతీయ గేయంగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa