ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమ్మినేని వీరభద్రం కి షాక్ ఇచ్చిన సీపీఎం కేంద్ర కమిటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 02:23 PM

 సీపీఎం సీనియర్ నేత, పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై ఆ పార్టీ కేంద్ర కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన్ను అభిశంసిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నికల సమయంలో ఆయన అనుసరించిన తప్పుడు రాజకీయ వైఖరి, పార్టీ నిబంధనల ఉల్లంఘనలే ఈ చర్యకు కారణంగా పేర్కొంది.రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యయుత చర్చకు బదులుగా లాబీయింగ్‌, ప్రలోభాలు, అస్తిత్వవాద రాజకీయాలు నడిచాయని కేంద్ర కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ పరిణామాలతో పార్టీ రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలిపోయిందని, ముఠాతత్వం ఆందోళనకర స్థాయికి చేరిందని తన నివేదికలో స్పష్టం చేసింది. పార్టీలో ఐక్యతను నెలకొల్పేందుకు పొలిట్‌బ్యూరో సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తమ్మినేని సహా నాయకత్వంలోని ఒక వర్గం వెనక్కి తగ్గడానికి నిరాకరించిందని తెలిపింది.సీనియర్ నాయకులే తెరవెనుక మంత్రాంగాలు, ప్రచారాలు చేయడం పార్టీ సంప్రదాయాలకు పూర్తి విరుద్ధమని కేంద్ర కమిటీ దుయ్యబట్టింది. ఈ పరిణామాలపై తమ్మినేని వీరభద్రంతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్‌బాబు, ప్రసాద్‌ల నుంచి వివరణ కోరినట్లు వెల్లడించింది. అయితే, వారు సమర్పించిన వివరణలు అసమగ్రంగా ఉండటంతో పాటు వాటిలో ఆత్మవిమర్శ లోపించిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురినీ అభిశంసిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa