రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పట్టణంలోని పలు వీధుల్లో కుక్కలు జనంపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయి. బద్ది పోచమ్మ వీధి, వడ్ల కమ్మరి వీధి, పాత కూరగాయల మార్కెట్, సుభాష్ నగర్ మరియు దోబీగాట్ల పరిసరాల్లో నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులు, వృద్ధులు అని తేడా లేకుండా సుమారు 35 మందిని కుక్కలు కరిచి గాయపరిచాయి.
ఈ ఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందజేస్తున్నామని, బాధితులకు అవసరమైన వ్యాక్సిన్లు మరియు మందులు అందుబాటులో ఉన్నాయని ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నవీన్ వెల్లడించారు. బాధితుల్లో కొందరికి తీవ్ర గాయాలవ్వడంతో వారు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
నెల రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన రెండోసారి చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. గతంలో కూడా కుక్కల దాడులు జరిగినప్పటికీ, అధికారులు శాశ్వత పరిష్కారం చూపకపోవడం వల్లే ఇప్పుడు మళ్లీ ఇన్ని కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుందని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో తిరగాలంటేనే భయం వేస్తోందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.
వరుస దాడుల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కల బెడదను నివారించడానికి నియంత్రణ చర్యలు చేపట్టాలని, అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. పుణ్యక్షేత్రం కావడంతో భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందని, ఈ సమస్యను గాలికొదిలేయకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వేములవాడ ప్రజలు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa