ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాల్లో ఉండటం లేదని,,,,కలెక్టర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 07:50 PM

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల పాటు ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ ప్రాధాన్యతలపై జిల్లా కలెక్టర్కు రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. క్షేత్ర స్థాయిలో ప్రతీ అర్హుడికి అందాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కింది స్థాయిలో అధికార యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని.. ప్రభుత్వ పథకాలు, సేవల్లో పారదర్శకత పెరగాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి చేకూరే లబ్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని.. ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజల అభిప్రాయాలు సేకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీల్లో గ్రామ సభల వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతీ పైసా లబ్ధిని ప్రజలకు వివరించడం ద్వారా ప్రభుత్వం తరఫున పారదర్శకత పెరుగుతుందని వెల్లడించారు.


తెలంగాణ విద్యా వ్యవస్థలో తమ ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి.. కలెక్టర్లకు వివరించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను ప్రతీ నెలా ఆయా ఏజెన్సీలకు చెల్లించాలని ఆదేశించారు. ఈ పథకానికి నిధుల కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లకే ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులను మరింత పటిష్ఠం చేసేందుకు వాటి సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీలతో హాస్పిటల్స్‌ను అనుసంధానం చేయాలని సూచించారు.


ఈ సందర్భంగా పలువురు కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కలెక్టర్లు.. ఆయా జిల్లా హెడ్ క్వార్టర్లలో నివాసం ఉండటం లేదని.. ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు అంటే అదే జిల్లాలో ఉండాలని.. అక్కడి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. అలా లేని వారిని సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. పద్దతి మార్చుకోని కలెక్టర్లపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.


రానున్న 99 రోజుల పాటు జిల్లా కలెక్టర్లు అత్యంత అలర్ట్‌గా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో నిర్వహించనున్న కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు ప్రజాప్రతినిధులను అందులో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ 99 రోజుల పాటు.. జిల్లా కలెక్టర్లు తమ పరిధిని దాటి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కారించడం కోసమే అధికార యంత్రాంగం పనిచేయాలని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa