భద్రాచలంలో వెలుగుచూసిన ఒక భారీ మోసం ప్రస్తుతం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే వృత్తిలో ఉన్న భార్యాభర్తలు తమ తెలివితేటలను ప్రజల క్షేమం కోసం కాకుండా, అక్రమ సంపాదన కోసం వాడారు. ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ అమాయక పేదలను లక్ష్యంగా చేసుకుని, వారి పేరుతో పాలసీలు కట్టించి, చివరకు వారు బతికుండగానే ‘మరణించినట్లు’ చిత్రీకరించి భారీ స్కామ్కు తెరలేపారు. సినీ ఫక్కీలో సాగిన ఈ అక్రమ దందా ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ఈ కేటుగాళ్లు పక్కా ప్రణాళికతో ఏకంగా 39 మంది వ్యక్తులకు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. గెజిటెడ్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా, అధికారిక ముద్రలను పోలిన నకిలీ స్టాంపులను ఉపయోగించి గ్రీన్ ఇంకుతో దర్జాగా సంతకాలు పెట్టేశారు. ఇలా సృష్టించిన తప్పుడు పత్రాలతో ఎల్ఐసీ కార్యాలయంలో క్లెయిమ్లు దాఖలు చేసి, దాదాపు రూ. 1.52 కోట్ల మేర బీమా సొమ్మును తమ జేబుల్లో వేసుకున్నారు. నిరుపేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.
ఈ వ్యవహారంలో ఎల్ఐసీ యంత్రాంగం తీరుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో క్లెయిమ్లు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో విచారణ జరపకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస తనిఖీలు చేయకుండానే కోట్లాది రూపాయల నిధులను విడుదల చేయడం వెనుక లోపాయికారీ ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది. చివరకు అంతర్గత విచారణలో ఈ దారుణం బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తాము బతికుండగానే తమను చనిపోయినట్లు రికార్డుల్లో చూపడంపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని, ప్రభుత్వ రంగ సంస్థను నమ్మించి వంచించిన ఈ ఘరానా మోసంపై లోతైన విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa