కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద పనిచేసే కూలీలకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్' పథకంలో భాగంగా పలు మార్పులు చేపట్టింది. ఈ నూతన సవరణల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉపాధి పనులు మరింత సులభతరం కానున్నాయి. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కూలీల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
నెట్వర్క్ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో హాజరు నమోదు విషయంలో పడుతున్న ఇబ్బందులకు కేంద్రం స్వస్తి పలికింది. గతంలో ఆన్లైన్ ద్వారానే అటెండెన్స్ తప్పనిసరి కావడంతో సిగ్నల్ లేని చోట్ల కూలీలు నష్టపోయేవారు. అయితే ఇప్పుడు ఆఫ్లైన్ విధానంలో కూడా హాజరు నమోదు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల మారుమూల అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో పనిచేసే కూలీలకు సమయానికి హాజరు పడే అవకాశం లభించనుంది, తద్వారా వారి పనిదినాలు వృథా కాకుండా ఉంటాయి.
దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, అంధులకు హాజరు నమోదు విషయంలో ఉన్న కఠిన నిబంధనను సడలించింది. సాధారణంగా ముఖ గుర్తింపు (Facial Recognition) సమయంలో కంటి రెప్ప ఆర్పాలనే నిబంధన ఉండేది, ఇది అంధులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం, అంధ కూలీలకు కంటి రెప్ప నిబంధన నుంచి పూర్తి మినహాయింపునిచ్చింది. ఈ నిర్ణయం వల్ల అంధులు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ పనిని కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.
సాంకేతిక కారణాల వల్ల ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తి కాని కూలీలకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేవైసీ పెండింగ్లో ఉన్నా సరే, వారిని పనులకు అనుమతించాలని స్పష్టం చేసింది. దీనివల్ల ఆధార్ అనుసంధానం లేదా ఇతర డేటా అప్డేట్ సమస్యల వల్ల పని కోల్పోయే ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్యల కంటే పేదలకు ఉపాధి కల్పించడమే ప్రాధాన్యత అని కేంద్రం ఈ మార్పుల ద్వారా నిరూపించింది. ఈ సానుకూల మార్పులతో గ్రామీణ ఉపాధి రంగం మరింత బలోపేతం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa