తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన బీసీ కులాలను కేంద్ర ప్రభుత్వం కూడా ఓబీసీ జాబితాలో చేర్చాలని.. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణలో మొత్తం 130 కులాలను రాష్ట్ర ప్రభుత్వం బీసీలుగా గుర్తించింది. అయితే అందులో 90 కులాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి. మిగిలిన 40 కులాలు మాత్రం ఓబీసీ కేటగిరీలో లేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. త్వరలోనే దేశంలో జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. త్వరలోనే ప్రక్రియను మొదలుపెట్టేందుకు రాష్ట్రాలు కూడా జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జనగణన ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే ఆ 40 కులాలను కూడా ఓబీసీల్లో విలీనం చేయాలని తెలంగాణ కోరుతోంది.
రాష్ట్రంలో ఉన్న మరో 40 బీసీ కులాలను తక్షణమే కేంద్ర ఓబీసీ (OBC) జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో జరగబోయే జనాభా గణన కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. వచ్చే జనాభా గణనలో భాగంగా తెలంగాణలో ఇళ్ల జాబితా సేకరణ పనులు 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి. ఆ తర్వాత అసలైన జనాభా లెక్కింపు 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. ఈ లోపే కులాల మార్పులు జరగాలని కమిషన్ కోరుతోంది.
ప్రస్తుతం 130 కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీలుగా గుర్తించింది. ఈ 130 కులాలకు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందించే అన్ని పథకాలు అమలు అవుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో మాత్రం తెలంగాణ నుంచి కేవలం 90 కులాలు మాత్రమే ఉండటం గమనార్హం. మిగిలిన 40 కులాల పేర్లు కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడంతో.. ఆ కులాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ బీసీ కమిషన్ తాజాగా సిఫారసులు చేసింది. జనగణనలో ఈ 40 కులాల వారు ఓబీసీలుగా నమోదు చేయకపోతే.. తెలంగాణలో బీసీల సంఖ్య వాస్తవంగా ఉన్న దాని కంటే తక్కువగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీలకు అందాల్సిన నిధులు, ప్రయోజనాలు, పథకాలు అందకుండా పోయే అవకాశాలు ఉన్నాయనే ఆవేదన వ్యక్తం అవుతోంది.
అయితే దీనిపై ఇప్పటికే తెలంగాణ సర్కార్, బీసీ కమిషన్ చాలా సార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే జనగణన మొదలు కాకముందే ఆ 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు లేఖ రాశారు.
నిబంధనల ప్రకారం ఒక కులాన్ని కేంద్ర ప్రభుత్వ జాబితాలోకి చేర్చాలంటే రాష్ట్ర కమిషన్ సిఫార్సు ఉండాలి. ఆ సిఫార్సులకు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) ఆమోదం కల్పించాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాతే ఆ కులాల విద్యార్థులకు విద్యా, ఉద్యోగాల పరంగా రిజర్వేషన్లు లభిస్తాయి. ఈ క్రమంలోనే నేషనల్ బీసీ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
మరోవైపు.. తెలంగాణలో జనగణన కార్యక్రమానికి సంబంధించి కీలక తేదీలు ఇప్పటికే వెల్లడయ్యాయి. మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల గణన కార్యక్రమం చేపట్టనున్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కేంద్రం జనగణన నిర్వహించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa