ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రేవంత్‌కు ఆయుధాలు సరెండర్,,,,తెలంగాణలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 06:09 PM

తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డికి తమ ఆయుధాలను సరెండ్ చేశారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ దళం మొత్తం లొంగిపోయినట్లు తెలిసింది. 31 ఏకే 47 తుపాకులతో పాటుగా 124 ఆయుధాలను సరెండర్ చేశారు. లొంగిపోయినవారిలో ఏవోబీ కీలక నేత చలసాని నవత కూడా ఉన్నారు. అంతకుముందు నాలుగు బస్సులలో మావోయిస్టులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుకున్నారు.


మరోవైపు తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం లొంగిపోయినట్లు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు.లొంగిపోయిన వారిలో 125 మంది మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వారు. తెలంగాణకు చెందిన వారు నలుగురు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఒకరు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీకి చెందిన వారు ముగ్గురు, డివిజనల్ కమిటీకి చెందిన10మంది, 40మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. అలాగే 70 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ వివరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన సూచన మేరకు మావోయిస్టులు లొంగిపోతున్నట్లు తెలిపారు.


మరోవైపు మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తమ పిలుపునకు గౌరవం ఇచ్చి లొంగిపోయిన మావోయిస్టులకు ధన్యవాదాలు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందన్నారు. ఆర్థిక, ఆరోగ్య భద్రతకు భరోసా ఇచ్చారు. శాంతియుత వాతావరణంలోనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న రేవంత్ రెడ్డి.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సూచించారు.


మావోయిస్టు అగ్రనేత గణపతి సహా ఏడుగురు మిగిలారన్న రేవంత్ రెడ్డి.. వారు కూడా లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన వారికి ప్రత్యేకమైన ఆరోగ్య భద్రత కార్డుల జారీతో పాటుగా.. అందించే నగదును కూడా పెంచే ప్రయత్నం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ తెలంగాణ పోలీసులకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa