మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్ యజమాని తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ హాల్లో జరిగే శుభకార్యాలకు పిలవని పేరంటానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అపరిచితులు గుంపులు గుంపులుగా రావడం వల్ల అసలైన అతిథులకు భోజనాలు అందడం లేదని, దీనివల్ల ఫంక్షన్ హాల్కు వచ్చే గిరాకీ గణనీయంగా తగ్గిపోయిందని ఆయన వాపోతున్నారు.
ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలని భావించిన యజమాని, ఏకంగా చట్టపరమైన హెచ్చరికను బోర్డుపై రాసి పెట్టారు. "ఆహ్వానం లేకుండా ఎవరైనా లోపలికి వస్తే ఐపీసీ సెక్షన్ 441 ప్రకారం అది అతిక్రమణ (Trespassing) కిందకు వస్తుంది. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం, వారికి 3 నెలల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా పడే అవకాశం ఉంది" అని ఆ బోర్డులో స్పష్టంగా పేర్కొన్నారు.
పెళ్లిళ్ల సీజన్లో అడ్రస్ లేని వ్యక్తులు ఫంక్షన్ హాళ్లలో దూరి భోజనాలు చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే, దీనివల్ల ఫంక్షన్ ఆర్డర్ ఇచ్చిన వారికి భారీగా నష్టం వాటిల్లుతోంది. ఖరీదైన వంటకాలు వృథా కావడమే కాకుండా, పెళ్లి పెద్దలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను గమనించే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇది కేవలం భయపెట్టడానికి మాత్రమే కాదని సదరు యజమాని స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ బోర్డుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు "బిర్యానీ కోసం వెళ్లి జైలు పాలు కావడం అవసరమా?" అని జోకులు పేలుస్తుంటే, మరికొందరు మాత్రం యజమాని తీసుకున్న నిర్ణయం సరైనదేనని మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా, ఆహ్వానం లేని అతిథుల వల్ల ఇబ్బంది పడే ఫంక్షన్ హాల్ యజమానులకు ఇదొక కొత్త మార్గంగా కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa