దేశంలో వాణిజ్య, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరత ఏర్పడిందని, ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఒక లేఖ రాశారు.ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కారణంగా హోటళ్లు, తినుబండారాలు, పీజీ హాస్టళ్లు, చిన్న ఆహార వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని కేటీఆర్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. సరఫరాను వెంటనే పునరుద్ధరించకపోతే, వేలాది సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని, వాటిపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేటీఆర్ కేంద్రానికి కొన్ని కీలక సూచనలు చేశారు. చిన్న వ్యాపారులకు ప్రాధాన్యతనిచ్చేలా ఎల్పీజీ కేటాయింపుల విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. జిల్లాల వారీగా సిలిండర్ల లభ్యతపై పారదర్శక సమాచారం కోసం రియల్-టైమ్ పబ్లిక్ డ్యాష్బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. సంక్షోభ సమయంలో చిన్న వ్యాపారులపై అదనపు భారం పడకుండా వాణిజ్య సిలిండర్ల ధరల పెరుగుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లించి, అధిక ధరలకు విక్రయించే బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లోని పీజీ హాస్టళ్లను ప్రత్యేక కేటగిరీగా గుర్తించి, అంతరాయం లేని సరఫరాను అందించాలని కోరారు. అలాగే, గ్యాస్ ఆధారిత శ్మశానవాటికలను అత్యవసర సేవలుగా వర్గీకరించి, వాటి కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాలని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఇది లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య అని, వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa