దేశీయ కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రూ.50 విలువ గల కొత్త బ్యాంకు నోట్లు త్వరలోనే విడుదల చేస్తామని బుధవారం ఓ ప్రకటన చేసింది. మహాత్మా గాంధీ సిరీస్లో కొత్త రూ.50 నోట్లను ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ముద్రించనున్నట్లు తెలిపింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ముద్రించే రూ.50 కొత్త డినామినేషన్ నోట్లు త్వరలోనే చలామణిలోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది.
ప్రస్తుతం చలామణిలో ఉన్న చాలా వరకు కరెన్సీ నోట్లు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ముద్రించినవే ఉన్నాయి. ఇప్పుడు శక్తికాంత దాస్ స్థానంలో ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన గతేడాది డిసెంబర్ 2024లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మహాత్మ గాంధీ సిరీస్లో కొత్త రూ.50 కరెన్సీ నోట్లను జారీ చేయాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ బుధవారం తెలిపింది. ' కొత్తగా ప్రింట్ చేయనున్న రూ.50 బ్యాంక్ నోట్లు మహాత్మా గాందీ (కొత్త ) సిరీస్కి అనుగుణంగానే డిజైన్ ఉంటుంది.' అని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది.
కొత్త రూ.50 నోట్లను ముద్రిస్తామని ఆర్బీఐ తెలిపిన క్రమంలో పాత నోట్లు చెల్లుబాటు అవుతాయా? శక్తికాంత దాస్ సంతకంతో ఉన్న నోట్లను రద్దు చేస్తారా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ విషయంపైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. కొత్త నోట్లు ముద్రించినప్పటికీ చలామణిలో ఉన్న పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. దేశ ప్రజలు పాత నోట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
రూ.2000 కరెన్సీ నోట్లను పెద్ద నోట్ల రద్దు తర్వాత 2016లో చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 5 ఏళ్లలోనే ఈ రూ.2 వేల కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. 2023, మే 19 నుంచి రూ.2 వేల నోటన్లు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. తొలుత వీటిని మార్చుకునేందుకు నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో అవకాశం ఉంది. అయితే, కొత్త నోట్లను ఉపసంహరించుకున్న క్రమంలో ఇప్పుడు రూ.50 నోట్లపై ప్రకటన చేయడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. పాత నోట్లను రద్దు చేయడం లేదా ఉపసంహరించుకుంటారేమోనని అనుమానపడుతున్నారు. అయితే, ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. పాత నోట్లు సైతం చెల్లుబాటులో ఉంటాయని పేర్కొంది.
![]() |
![]() |