వివాహానంతరం భార్యాభర్తలు స్నేహితులతో హుందాగా, గౌరవంగా వ్యవహరించాలని, శృతి మించితే అది మనోవేదనకు దారితీస్తుందని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ జస్టిస్ వివేక్ రొసియా, జస్టిస్ గజేంద్ర సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య మరో పురుషుడితో అశ్లీల చాటింగ్ చేస్తే అది భర్త పట్ల క్రూరత్వంగా పరిగణించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ (భార్య) తన పురుష స్నేహితుడితో లైంగికపరమైన విషయాలు చర్చిస్తూ అసభ్యంగా సంభాషించినట్లు కోర్టు గుర్తించింది. ఈ తరహా ప్రవర్తనను ఏ భర్త సహించలేడని ధర్మాసనం తేల్చి చెప్పింది. స్నేహితులతో సంభాషణ మర్యాదగా ఉండాలని, హద్దులు దాటితే అది దాంపత్య జీవితానికి చేటు చేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ జీవిత భాగస్వామికి అభ్యంతరం ఉన్నప్పటికీ అలాంటి కార్యకలాపాలను (చాటింగ్) కొనసాగిస్తే, అది నిస్సందేహంగా మానసిక హింస కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భార్య తన పాత ప్రియుళ్లతో అసభ్యంగా చాటింగ్ చేస్తోందని భర్త ఆరోపించగా, ఆమె వాటిని ఖండించింది. తన మొబైల్ను హ్యాక్ చేసి, తప్పుడు సందేశాలు సృష్టించారని ఆరోపించింది. అంతేకాకుండా, భర్త తన గోప్యతను ఉల్లంఘించాడని, రూ.25 లక్షల కట్నం డిమాండ్ చేశాడని ఆరోపించింది. అయితే, భర్త ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఆమె తండ్రి కూడా తన కూతురు బాయ్ఫ్రెండ్తో అసభ్యంగా చాటింగ్ చేసినట్టు సాక్ష్యం చెప్పడంతో దిగువ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును హైకోర్టు సమర్థించింది
![]() |
![]() |