ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియాపై సిక్సర్ల వర్షం, ఫైనల్‌కు ‘సచిన్’ టీమ్

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 10:34 PM

ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో భార‌త వెట‌ర‌న్ ప్లేయ‌ర్ యువ‌రాజ్ సింగ్ సత్తా చాటాడు. ఒకప్పటి యూవీనీ గుర్తుకు తెచ్చేలా బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీ సెమీ ఫైనల్‌లో 30 బంతుల్లో 59 రన్స్ చేశాడు. దీంతో ఇండియా మాస్టర్స్ జట్టు ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను ఓడించి ఫైనల్ చేరింది.


రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న టెండూల్కర్.. భారత్‌కు శుభారంభం అదించాడు. 30 బంతుల్లో 42 రన్స్ చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్ సింగ్ పెను విధ్వంసం సృష్టించాడు. కీలకమైన సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో ఏడు సిక్సర్లు బాది ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు.


అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఆస్ట్రేలియాపై చెలరేగిపోయి ఆడే యువీ.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లోనూ అదే పునరావృతం చేశాడు. 30 బంతుల్లో 59 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో ఏకంగా ఏడు సిక్సర్లు ఉండటం గమనార్హం. స్టువ‌ర్ట్ బిన్నీ (36), యూసుఫ్ పఠాన్ కూడా సత్తా చాటడంతో ఇండియా మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 220 రన్స్ చేసింది.


అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టు తేలిపోయింది. కనీసం 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. భారత బౌలర్ల దెబ్బకు 18.1 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్.. 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్‌కు దూసుకెళ్లింది.


ఆరు దేశాల మాస్టర్స్ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇందులో ఇండియా మాస్టర్స్‌తో పాటు శ్రీలంక మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్, దక్షిణాఫ్రికా మాస్టర్స్, ఇంగ్లాండ్ మాస్టర్స్ జట్లు ఉన్నాయి. మార్చి 16న జరిగే ఫైనల్‌లో భారత్.. వెస్టిండీస్ లేదా శ్రీలంకతో తలపడనుంది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com