ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో పెళ్లి వద్దన్నాడని కుమారుడి హత్య

Crime |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 10:22 PM

ఆ వృద్ధుడికి 76 సంవత్సరాలు. కొడుకు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఉంట్లోనే ఉంటున్నాడు. అయితే 20 ఏళ్ల క్రితమే అతడి భార్య చనిపోగా.. మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆశ పుట్టింది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా తీవ్రంగా వ్యతిరేకించారు. పరువు పోతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతడు మాత్రం తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటూ గొడవ చేశాడు. దీంతో అతడి కుమారుడు ఈ వయసులో పెళ్లేంటంటూ మరింత రెచ్చిపోయాడు. దీంతో కొడుకుపై పగ పెంచుకున్న ఆయన.. తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆపై కోడలిని కూడా చంపేందుకు పరుగులు పెట్టాడు. కానీ ఆమె తప్పించుకుని ప్రణాలు కాపాడుకుంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


గజరాత్ రాజ్‌కోట్ జిల్లాలోని జాస్థాన్ పట్టణానికి చెందిన 76 ఏళ్ల రామ్ బోరిచా.. ప్రస్తుతం తన 52 ఏళ్ల కొడుకు ప్రతాప్ ఉంటున్న ఇంటి పక్కనే ఉంటున్నాడు. ప్రతాప్, ఆయన భార్య జయ, కుమారుడు జైదీప్‌లు మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నప్పటికీ.. తండ్రికి ఆహారం ప్రతాప్ ఇంటి నుంచే వెళ్తుంది. అయితే అయితే రామ్ బోరిచా భార్య 20 ఏళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న రామ్ బోరిచా.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.


 ఈ విషయాన్ని తన కుమారుడు ప్రతాప్‌కు చెప్పాడు. అలాగే కోడలు, మనవడికి కూడా వివరించగా వారంతా వద్దన్నారు. మనవడికి పెళ్లి చేయాల్సిన వయసులో తాత చేసుకుంటే పరువు పోతుందని.. తాము ఈ పెళ్లికి అస్సలే ఒప్పుకోమని తెగేసి చెప్పారు. దీంతో వారిపై కోపం పెంచుకున్న రామ్ బోరిచా.. ఆదివారం రోజు దారుణానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా జైదీప్ పాలు తెచ్చేందుకు బయటకు వెళ్లగా.. ప్రతాప్ తన తండ్రి వద్దకు వెళ్లి టీ తాగేందుకు రమ్మని పిలవబోయాడు.


కానీ అప్పటికే తుపాకీ పట్టుకుని ఉన్న రామ్ బోరిచా.. కుమారుడిని గదిలో బంధించి మరీ రెండు సార్లు కాల్చి చంపాడు. తుపాకీ శబ్దం విన్న ఆయన భార్య మామ ఇంట్లోకి వెళ్లగా.. భర్త రక్తపు మడుగులో పడి ఉండడనాన్ని చూసింది. భయంతో వణికిపోతుండగానే.. మామ రామ్ బోరిచా ఆమెను కూడా చంపేందుకు వచ్చాడు. ఆ విషయం గుర్తించిన జయ వెంటనే బయటకు పరుగులు పెట్టి తలుపులు వేసేసింది. ఆపై కొద్ది సేపటికే పాల కోసం వెళ్లిన కుమారుడు రాగా జరిగిన విషయాన్ని చెప్పింది.


దీంతో జైదీప్ కిటికీ ద్వారా తాత ఇంట్లోకి తొంగి చూడగా.. తండ్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే తాత కూర్చుని ఉండడం చూశాడు. ఆపై వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా.. హుటాహుటిన వారు రంగంలోకి దిగారు. తలుపులు తీసి రామ్ బోరిచాను అరెస్ట్ చేశారు. ఆపై పోస్టుమార్టం నిమిత్తం ప్రతాప్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే విచారణలో రామ్ బోరిచా.. తను కుమారుడిని చంపినందుకు తానేమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని.. చాలా రోజులుగా తన కుమారుడు తనను వేధిస్తున్నాడని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com