ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలూచిస్తాన్ రైలు హైజాక్ వెనుక భారత్ హస్తం.. పాక్ సంచలన ఆరోపణలు

international |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 10:05 PM

పాకిస్తాన్‌ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. భారత్‌పై నిరంతరం తన అక్కసును వెళ్లగక్కే పాకిస్తాన్.. భారత అంతర్గత విషయాల్లోనూ జోక్యం చేసుకుని ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును.. బలోచ్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఈ హైజాక్ ఘటనలో పలువురు ప్రయాణికులు, పాక్ సైన్యాన్ని బలోచ్ లిబరేషన్ ఆర్మీ హతమార్చగా మిగితా వారిని వదలిపెట్టింది. అయితే బందీలైన ప్రయాణికులను విడిపించేందుకు పాక్ సైన్యం, ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సఫలం కావడంతో ఈ హైజాక్ నుంచి మిగిలిన వారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే భారత్‌పై పాక్ విదేశాంగ కార్యాలయం తీవ్ర ఆరోపణలు చేసింది.


క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్స్ హైజాక్ చేయగా.. ఈ ఘటన వెనక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం గురువారం సంచలన ఆరోపణలకు తెరతీసింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ వెనుక ఉన్న బలూచ్ ఉగ్రవాదులు.. ఆఫ్ఘనిస్థాన్‌లోని వారి సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నారని నిఘా నివేదికలు సూచించాయని.. పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే.. ఈ ఘటనలో భారత్ హస్తం ఉందనే రీతిలో వ్యాఖ్యలు చేశారు.


బలూచ్ లిబరేషన్ ఆర్మీ సహా అలాంటి సంస్థలు బలూచిస్తాన్‌లో, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పనిచేయకుండా అడ్డుకోవాలని తాలిబన్ ప్రభుత్వాన్ని పాక్ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినట్లు షఫ్కత్ అలీ ఖాన్ స్పష్టం చేశారు. అయితే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన తర్వాత పాక్ ప్రభుత్వం, సైన్యం చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయినట్లు ఆన తేల్చి చెప్పారు. మరోవైపు.. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా మాట్లాడుతూ.. ఈ రైలు హైజాక్‌లో భారత ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ భూభాగం నుంచి భారత్ ఈ దాడులను చేస్తోందని రాణా సనావుల్లా విమర్శలు గుప్పించారు. తాజాగా పాక్ అధికారిక మీడియా అయిన డాన్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాణా సనావుల్లా ఈ ఆరోపణలు చేశారు. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ), బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి రెండు సంస్థలకు భారత్ మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు.


మరోవైపు.. పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటనపై స్పందించారు. సంఘటనా స్థలంలో ఉన్న 33 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ భద్రతా దళాలు హతమార్చాయని పేర్కొన్నారు. మంగళవారం ఉగ్రవాదులు ఆ రైలుపై దాడి చేసినప్పుడు 21 మంది ప్రయాణికులను చంపారని తెలిపారు. 400 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ రైలును బెలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని సెబీ జిల్లా మారుమూల ప్రాంతంలో బీఎల్ఏ ఫైటర్లు హైజాక్ చేశారు. పాక్ ప్రభుత్వ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో 70-80 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com