విదేశీ సంపన్నులకు గోల్డ్ కార్డు వీసాలు జారీ చేస్తామని, వాటితో అమెరికా పౌరసత్వం లభిస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, గ్రీన్ కార్డుదారులకు శాశ్వత పౌరసత్వంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తావిస్తున్నారు. హెచ్-1 బీ వీసా ద్వారా అమెరికా వెళ్లిన విదేశీయులకు గ్రీన్ కార్డు ద్వారా పౌరసత్వం లభిస్తుంది. ఇది వారు అగ్రరాజ్యంలో శాశ్వత నివాసానికి, ఉద్యోగానికి అవకాశం కల్పిస్తుంది. కానీ, గ్రీన్ కార్డు శాశ్వతంగా అమెరికాలో ఉండిపోవడానికి హామీ ఇవ్వదని జేడీ వాన్స్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘గ్రీన్ కార్డుదారులకు శాశ్వతంగా అమెరికాలో నివాసం ఉండే హక్కు లేదు.. ఇది 'వాక్ స్వేచ్ఛ' గురించి కాదు. ఇది మరీ ముఖ్యంగా జాతీయ భద్రతకు సంబంధించి. మనం అమెరికా పౌరులుగా మన సమాజంలో ఎవరిని చేరాలని నిర్ణయించుకుంటాం అనే దాని గురించి’ అని జేడీ వాన్స్ పేర్కొన్నారు. క్రిమినల్ చర్యలకు పాల్పడటం, దీర్ఘకాలం అమెరికాకు దూరంగా ఉండటం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించడం సహా పలు పరిస్థితుల్లో గ్రీన్ కార్డును రద్దుచేసేందుకు అమెరికా చట్టాలు అనుమతిస్తాయి.
ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. గోల్డ్ కార్డు ప్రోగ్రామ్ ద్వారా 5 మిలియన్ డాలర్లు చెల్లించి విదేశీయులు అమెరికాలో నివాసం, పనిచేసే హక్కును పొందుతారని అన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు 35 ఏళ్లుగా ఇస్తున్న ఈబీ–5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో కొత్త గోల్డ్ కార్డ్ స్కీంను తీసుకొచ్చినట్టు తెలిపారు. రెండు వారాల్లో ఇది అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు ‘‘గోల్డ్ కార్డ్ విధానం కింద అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీయులు మరింత సంపన్నులు అవుతారు. మరిన్ని విజయాలు సాధిస్తారు. పెద్ద మొత్తంలో వాళ్లు డబ్బు ఖర్చు చేసి.. భారీగా పన్నులు చెల్లిస్తారు.. దీనివల్ల ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తారు.. ఈ పథకం గొప్ప విజయవంతమవుతుందని మేం భావిస్తున్నాం’ అని ట్రంప్ చెప్పారు.
ప్రస్తుత వలస విధానం అంతర్జాతీయ ప్రతిభావంతులను ముఖ్యంగా భారత్ నుంచి వచ్చిన వారిని.. ఉన్నత విశ్వవిద్యాలయాలలో విద్యను పూర్తి చేసిన తర్వాత అమెరికాలో ఉండేందుకు అనుమతించడం లేదని ట్రంప్ అన్నారు. ‘ఒక వ్యక్తి భారత్, చైనా, జపాన్, ఇతర దేశాల నుంచి వచ్చి, హార్వర్డ్ లేదా వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్లో ఉన్నత చదువు చదువుతాడు... వారికి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి.. కానీ ఆ వ్యక్తి దేశంలో ఉంటారా లేదా అనే దానిపై ఎటువంటి ఖచ్చితత్వం లేకపోవడంతో ఆఫర్ వెంటనే రద్దు అవుతుంది’ అని ఆయన అన్నారు.
కాగా, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా కాంగ్రెస్ 1990లో ఈబీ–5 వీసా ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది. అమెరికాలో కనీసం 10 మంది ఉద్యోగులు ఉన్న ఏదైనా ఒక సంస్థలో 10 లక్షల డాలర్లు (దాదాపు రూ. 9 కోట్లు) పెట్టుబడి పెట్టే విదేశీయులకు ఈ వీసాలను మంజూరు చేస్తున్నాారు.
![]() |
![]() |