భారత్ నుంచి కీలక రహస్యాలు.. ఆర్మీ, రక్షణ రంగానికి చెందిన సమాచారాన్ని సేకరించేందుకు దాయాది పాకిస్తాన్ అనేక ఎత్తులు వేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ.. భారత్లోని పలువురికి మహిళలను ఎరగా వేసి.. వారి దగ్గరి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఎంతో మంది ఇలా దొరికిపోగా.. తాజాగా మరోసారి ఇలాంటి హనీ ట్రాప్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పాక్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న ఓ అమ్మాయి వలపు వలలో పడిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి.. మిలిటరీ రహస్యాలను లీక్ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఆ వ్యక్తితోపాటు అతడి ఫ్రెండ్ను కూడా తాజాగా ఉత్తర్ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పాక్ ఐఎస్ఐకు గూఢచర్యం చేస్తూ.. భారత రక్షణ రంగానికి చెందిన రహస్య సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తర్ప్రదేశ్లో రవీంద్ర కుమార్ అనే వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ ఏజెంట్ హనీ ట్రాప్లో పడిన రవీంద్ర కుమార్.. భారత సైన్యం, ఆయుధాలకు సంబంధించిన కీలక డేటాతో పాటు గగన్యాన్ ప్రాజెక్ట్ వివరాలను కూడా పాక్కు చేరవేసినట్లు విచారణలో తేలింది. ఫిరోజాబాద్లోని హజ్రత్పుర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్గా పనిచేస్తున్న రవీంద్ర కుమార్కు.. గతేడాది నేహా శర్మ అనే మహిళ ఫేస్బుక్లో పరిచయం అయింది. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం పనిచేస్తున్న నేహా శర్మ.. రవీంద్ర కుమార్తో స్నేహం చేసి.. డబ్బులు ఆశ చూపించి మిలిటరీ రహస్యాలను సంపాదించినట్లు పోలీసుల పేర్కొన్నారు.
అయితే రవీంద్ర కుమార్ నేహా శర్మ ఫోన్ నంబర్ను చంద్రన్ స్టోర్కీపర్ పేరుతో సేవ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వాట్సాప్లో ఆమెకు అనేక కీలక డాక్యుమెంట్లు పంపించినట్లు తేల్చారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, 51 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ అధికారులు చేపట్టిన లాజిస్టిక్స్ డ్రోన్ టెస్ట్లు, రోజువారీ ప్రొడక్షన్ డేటా, స్క్రీనింగ్ కమిటీ పంపిన రహస్య లేఖలను సంపాదించి.. పంపించినట్లు తెలిసింది. ఇక ఈ డేటాలో ఇస్రో చేపడుతున్న కీలక ప్రాజెక్ట్ అయిన గగన్యాన్ వివరాలు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇక రవీంద్ర కుమార్.. కేవలం నేహా శర్మతో మాత్రమే కాకుండా పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ఐఎస్ఐ సభ్యులతోనూ నేరుగా కాంటాక్ట్లో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. భారత రక్షణ రంగ ప్రాజెక్టులకు సంబంధించిన నిఘా సమాచారాన్ని రవీంద్ర కుమార్.. పాక్ ఐఎస్ఐకి పంపించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవీంద్ర కుమార్తోపాటు అతడి ఫ్రెండ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని.. వారి వాట్సాప్ చాట్లను తనిఖీ చేస్తున్నారు.
![]() |
![]() |