ఫార్మాట్ ఏదైనా గత కొన్ని నెలలుగా ప్రపంచ క్రికెట్లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తోంది. జట్టులో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా.. ఆటతీరులో మాత్రం మార్పు రావట్లేదు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో లీగ్ దశ నుంచే నిష్క్రమించిన ఆ జట్టు.. తాజాగా ఇటీవల పాకిస్థాన్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ నాకౌట్ చేరలేదు. కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.
దీంతో ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా కప్, వచ్చే ఏడాది భారత్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం జట్టును సిద్ధం చేయడమే లక్ష్యంగా ఆ జట్టు భారీ మార్పులు చేసింది. సీనియర్ ప్లేయర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబార్ ఆజమ్లపై వేటు వేసింది. యువప్లేయర్ సల్మాన్ అఘాకు టీ20 కెప్టెన్సీ అప్పగించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది.
కాగా ఈ పర్యటన ప్రారంభానికి ముందు పాక్ కొత్త కెప్టెన్ సల్మాన్ అఘా.. తమ జట్టులో ఎంతో మంది యువ క్రికెటర్లు ఉన్నారని.. ఎలాంటి భయం లేకుండా.. క్రికెట్ ఆడతామని ప్రగల్భాలు పలికాడు. అయితే న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్లోనే ఆ జట్టుకు షాక్ తలిగింది. భయం లేకుండా క్రికెట్ ఆడటం అటుంచితే.. కనీసం పూర్తి ఓవర్ల పాటు బ్యాటింగ్ కూడా చేయలేకపోయింది. ప్రత్యర్థి జట్టులో రెండు వికెట్లు కూడా పడగొట్టలేకపోయింది. దీంతో ఆ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది.
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా పాక్ జట్టు.. నేడు తొలి టీ20 మ్యాచ్లో తలపడింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్.. 18.4 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది. అనంతరం న్యూజిలాండ్.. 10.1 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే పాకిస్థాన్ ఈ మ్యాచ్లో గెలవకపోయేందనే బాధ కంటే కూడా.. చిత్తుగా ఓడిన విషయంపై ఆ జట్టు ఫ్యాన్స్ను తీవ్రంగా బాధపెడుతోంది. ఇదేనా ఫియర్లెస్ క్రికెట్ అని ఆ జట్టు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
![]() |
![]() |