భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించిన తర్వాత టీ20 క్రికెట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో 80కి పైగా సగటుతో కోహ్లీ పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ 2025 కోసం అతడు సన్నద్ధమవుతున్నాడు.
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్.. క్రికెట్కు రిటైర్మెంట్, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ వంటి విషయాలపై మాట్లాడాడు. ఈ క్రమంలోనే టీ20 క్రికెట్ రిటైర్మెంట్పై యూ టర్న్ అంశంపై కూడా తన మనసులోని మాటను చెప్పాడు. ప్రస్తుతం తాను మంచిస్థితిలో ఉన్నానని.. రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేసే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు. ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడం అద్భుతమైన విషయమని కొనియాడాడు.
ఒలింపిక్స్ కోసం మీరు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు కోహ్లీ మాట్లాడుతూ.. "లేదు. కానీ ఒకవేళ భారత్ గోల్డ్ మెడల్ మ్యాచ్కు అర్హత సాధిస్తే.. ఆ ఒక్క మ్యాచ్ కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తా. మ్యాచ్ గెలిచి గోల్డ్ మెడల్ తో స్వదేశానికి తిరిగొస్తా" అని కోహ్లీ సరదాగా వ్యాఖ్యానించాడు.
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్పై..
"కంగారు పడొద్దు. నేను ఎటువంటి రిటైర్మెంట్ ప్రకటనలు చేయట్లేదు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది. క్రికెట్ను ఆస్వాదిస్తున్నా. ఆట పట్ల ప్రేమ, ఆనందమే నన్ను క్రికెట్ ఆడేలా చేస్తున్నాయి. ఆడాలన్న తపన ఉంటే రిటైర్మెంట్పై ఆలోచించడం కష్టంగా ఉంటుంది. ఎప్పుడు రిటైర్మెంట్ చెబుతామనే విషయాన్ని సరైన సమాధానం ఉండదు. దీనిపై రాహుల్ ద్రవిడ్తో కూడా మాట్లాడాను. 'నీ మనసు చెప్పిందే ఫాలో అయిపో' అని నాతో ఆయన చెప్పాడు. ప్రస్తుతానికి నా ఆట పట్ల హ్యాపీగా ఉన్నా" అని విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సదస్సులో అన్నాడు
![]() |
![]() |