ట్రెండింగ్
Epaper    English    தமிழ்

: భారీగా పడుతున్న డాలర్ విలువ.. బంగారం ధరల్లో భారీ మార్పు

business |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 10:54 PM

కొంతకాలంగా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు.. ముఖ్యంగా సుంకాల విధింపు నేపథ్యంలో అక్కడ ఆర్థిక మాంద్యం భయాలు పెరిగిపోయాయి. ఇంకా.. ట్రేడ్ వార్ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో స్టాక్ మార్కెట్లు పడిపోతుండటంతో పాటుగా.. డాలర్ విలువ తగ్గుతోంది. తాజాగా యూఎస్ డాలర్ మరోసారి భారీగా తగ్గింది. డాలర్ ఇండెక్స్ విలువ జనవరిలో అత్యధికంగా 110కి చేరగా.. అక్కడి నుంచి 6.40 శాతం పడిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా 5 నెలల కనిష్టానికి డాలర్ దిగొచ్చింది. ఈ క్రమంలోనే మరోవైపు బంగారం ధరలు పెరుగుతున్నాయి.


సాధారణంగానే బంగారం ధరలకు, డాలర్‌కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. అంటే డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. ఇదే సమయంలో డాలర్ విలువ పతనమైతే.. గోల్డ్ రేటు తగ్గుతుంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. డాలర్ విలువ పడిపోతుండగా.. గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి. మార్చి 18న మరో కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది.


ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మార్చి 18 సాయంత్రం 6 గంటలకు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) 3035 డాలర్లపైకి చేరింది. ఇవాళ ఉదయం చూసినట్లయితే ఇది 3 వేల డాలర్ల దగ్గర మాత్రమే ఉండేది. ఒకవైపు ఆర్థిక అనిశ్చితి.. అమెరికా మాంద్యం భయాలు.. డాలర్ పతనం.. ఇవన్నీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా మరింత బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలోనే పసిడిపై పెట్టుబడులు పెరిగి బంగారం ధర మరింత పెరిగేలా చేస్తోంది. తాజాగా చేరిన ధర జీవన కాల గరిష్టం కావడం విశేషం.


దేశీయ మార్కెట్లలో చూస్తే ఎంసీఎక్స్ బంగారం ధరలు ఏప్రిల్ 4 కాంట్రాక్టులకు సంబంధించి.. మార్చి 18న రూ. 88,672 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. అయితే ఇప్పుడు భవిష్యత్తులో బంగారం ధరల్ని నిర్ణయించేది యూఎస్ ఫెడ్ పాలసీ అని చెబుతున్నారు. అవును.. ఫెడ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను గతేడాది సెప్టెంబర్ నుంచి వరుసగా 3 సమీక్షల్లో 100 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.25 శాతానికి చేర్చింది. జనవరిలో యథాతథంగానే ఉంచింది. ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచుతుందని భావిస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే గనుక.. మళ్లీ బంగారం ధరలు మరింత గరిష్టాలకు చేరొచ్చనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం గోల్డ్ ఇంకా సానుకూలంగానే ఉందని.. సమీప భవిష్యత్తులో 3100 డాలర్లకు చేరొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది బంగారంపై ఇన్వెస్ట్ చేసే వారికి లాభాలు చేకూర్చుతుందని అంటున్నారు. భౌతికంగా కొనుగోలు చేసేవారికి మాత్రం ఇప్పట్లో కష్టమేనని అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com