ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్.. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు బిగ్ స్కెచ్ వేసింది. 2025 ఆరంభంలోనే.. దాదాపుగా 14,000 మంది మేనేజర్ల ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించింది. దీని ద్వారా సంవత్సరానికి 2.1 బిలియన్ల డాలర్ల నుంచి నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత కరెన్సీలో చూస్తే రూ. 31 వేల కోట్లకుపైగానే ఉంది. ఈ తొలగింపులు సంస్థలోని గ్లోబల్ మేనేజ్మెంట్ ఉద్యోగుల్లో 13 శాతం తగ్గుదలకు దారితీస్తుంది. మేనేజర్ల సంఖ్య 1,05,770 నుంచి 91,936కు తగ్గుతుందని చెప్పొచ్చు. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, బృందాలను పునర్ వ్యవస్థీకరించడానికి అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
పలు మీడియాల్లో వచ్చిన కథనాల ప్రకారం.. సీఈఓ ఆండీ జస్సీ కంపెనీ నిర్ణయాలు తీసుకునే విధానాన్ని సులభతరం చేయడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారు. 2025 మొదటి త్రైమాసికం నాటికి మేనేజర్ల కంటే ఇతర ఉద్యోగుల నిష్పత్తిని కనీసం 15 శాతం పెంచాలని ఆయన యోచిస్తున్నారు. మేనేజ్మెంట్ స్థాయిలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా అమెజాన్ కార్యాలయాల్లో పని వేగాన్ని మెరుగుపరచాలని చూస్తోంది. ఇంకా లాభాలను పెంచడంపై దృష్టి సారించి అమెజాన్ ఈ మార్పులు చేసింది. అవసరం లేని కార్యక్రమాలను కూడా తగ్గించింది. ఇక ఇండియా స్టాక్ మార్కెట్లోకి అమెజాన్ ఐపీఓ ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్నట్లు కూడా తెలిసింది.
మోర్గాన్ స్టాన్లీ ప్రకారం.. ఈ అమెజాన్ ఇనిషియేటివ్లో దాదాపు 13,834 మేనేజర్ల ఉద్యోగాలు పోనున్నాయి. ఇది అమెజాన్ ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నాలకు బాగా ఉపయోగపడుతుందని పేర్కొంది. ఉద్యోగాల తొలగింపుతో పాటు అమెజాన్ మరికొన్ని ఖర్చులను తగ్గించే పద్ధతులను కూడా ప్రవేశపెట్టింది. అందులో "బ్యూరోక్రసీ టిప్లైన్" ఒకటి. దీని ద్వారా ఉద్యోగులు కార్యాలయాల్లోని పనికిరాని విధానాల గురించి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే.. సీనియర్ స్థాయి ఉద్యోగులను కొత్తగా నియమించకుండా ఆపడం, డైరెక్ట్ రిపోర్ట్లను పెంచడం, జీతాల విధానాన్ని సమీక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని మేనేజర్లకు సూచించారు.
కొవిడ్ సమయంలో అమెజాన్ ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. 2019లో 7,98,000 మంది ఉద్యోగులు ఉండగా, 2021 చివరి నాటికి 1.6 మిలియన్లకు పైగా పెరిగింది. కానీ, పరిస్థితులు మారడంతో కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను మళ్లీ సమీక్షిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా 2022, 2023 లో వేలాది ఉద్యోగుల్ని తొలగించింది. వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగులను మార్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఇదే సమయంలో చాలా టెక్ కంపెనీలు ఏఐ సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నాయి. దీంతోనే ఖర్చుల్ని తగ్గించుకునే దిశగా ఆలోచిస్తున్నాయి. చాలా కంపెనీలు ఇదే చేస్తుండగా.. అమెజాన్ ఎప్పటినుంచో మాస్ లేఆఫ్స్ అమలు చేస్తోంది.
![]() |
![]() |