ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదని.. ఇంట్లోనే ఇలాంటి పనా? సెల్‌ ఫోన్‌ చూస్తే దొరికేసింది.

Crime |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 10:27 PM

గుంటూరులో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఒక యువతి తన ప్రియుడితో కలిసి సొంత ఇంట్లోనే చోరీ చేయించింది. తన పెళ్లి కోసం తల్లిదండ్రులు చేయించిన రూ. 90 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ప్రియుడితో చోరీ చేయించింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించడం లేదనే కోపంతో ఆ యువతి ఈ పని చేసింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..


గుంటూరు నగరంలో ఇటీవల ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 90 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదుచేశారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇదేమైనా పాత నేరస్థులా పనా అనే కోణంలో తొలుత దర్యాప్తు జరిపారు. ఇందులో భాగంగా దొంగల ముఠాలపై దృష్టి సారించారు. కానీ, దర్యాప్తులో ఏమీ తేలలేదు. దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో పోలీసులు ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని అనుమానించారు. దీంతో ఇంట్లోని కుటుంబసభ్యులపై దృష్టి సారించారు. ఇంట్లోని యువతిపై పోలీసులకు అనుమానం కలిగింది.


యువతి ఫోన్ కాల్స్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలించారు. చోరీ జరిగిన సమయంలో ఆమె ఒకే నంబరుకు చాలా కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. తను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయడానికి తన తండ్రి అంగీకరించలేదని.. అందుకే తన పెళ్లి కోసం చేయించిన నగలు ఎక్కడ ఉన్నాయో ప్రియుడికి చెప్పి రప్పించినట్టు యువతి అంగీకరించింది. కుటుంబ సభ్యులు వేరే ఊరు వెళ్లినప్పుడు ప్రియుడితో సొంతింటిలో చోరీ చేయించినట్టు తెలిపింది. దీంతో గుంటూరు పోలీసులు వెంటనే నిందితుడి ఇంటికి వెళ్లారు. ఇంటిలోని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే యువతి ప్రియుడు పరారీలో ఉండగా.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన గుంటూరులో సంచలనం సృష్టించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com