ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి గరిష్టాలకు గోల్డ్ రేటు.. అందరి దృష్టీ దీనిపైనే

business |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 11:11 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపుదల కారణంగా ప్రపంచ వాణిజ్య యుద్ధం ముదిరింది. ఇది ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం భయాల్ని రేపుతోంది. ఈ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు కూడా రోజురోజుకూ రికార్డు గరిష్టాల్ని తాకుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3030 డాలర్లపైన ఉండగా.. సిల్వర్ రేటు 33.50 డాలర్లపైన కొనసాగుతోంది. దేశీయంగా కూడా రోజురోజుకూ ఇలాగే గరిష్ట స్థాయిల్ని నమోదు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 90 వేల మార్కు కూడా దాటి దూసుకెళ్తోంది. 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ జువెల్లరీ రేట్లు కూడా రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. దీనికి తోడు యూఎస్ డాలర్ పడిపోతుండటం.. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం.. ట్రంప్ కఠిన నిర్ణయాలు.. ఇవన్నీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా డిమాండ్ పెంచుతున్న తరుణంలో రేట్లు కొండెక్కుతున్నాయి. ఈ క్రమంలో.. ఇప్పుడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు ప్రకటించనుంది.


వాల్ స్ట్రీట్ సహా పసిడి ప్రియులు అంతా ఈ ఫెడ్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి కారణంగా ఫెడ్ ఈసారి కూడా వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఆర్థిక వేత్తలు అమెరికాలో స్టాగ్‌ఫ్లేషన్ గురించి హెచ్చరిస్తున్నారు. ఇది ప్రభుత్వ వ్యయాల్ని తగ్గించడం, ఉద్యోగాల తొలగింపుల కారణంగా సంభవిస్తుందని అంచనా వేస్తున్నారు.


వడ్డీ రేట్లను తగ్గించేందుకు తమకు తొందరేమీ లేదని ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కొద్దిరోజుల కిందట వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ట్రంప్ విధానాల వల్ల ఆర్థిక అనిశ్చితి ఉందని.. అందుకే రాబోయే కొంతకాలంగా వడ్డీ రేట్లను మార్చే అవకాశాలు లేవని ఆయన అన్నారు. మార్చి 18,19 తేదీల్లో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశం కాగా.. భారత కాలమానం ప్రకారం.. మార్చి 20 అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఫెడ్ వడ్డీ రేట్లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఇది తెల్లవారితే గురువారం సమయం అన్నమాట. పావెల్ వ్యాఖ్యల గురించి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారన్న సంగతి తెలిసిందే. మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేంతవరకు సాధ్యమైనంత వరకు వడ్డీ రేట్లను తగ్గించొద్దనే భావిస్తున్నట్లు తెలుస్తోంది.


సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి బంగారం ధరలు మరింత పెరుగుతుంటాయి. ఒక వడ్డీ రేట్లను ఫెడ్ పెంచితే.. బంగారం ధరలు పడిపోతుంటాయి. స్థిరంగా ఉంచినా బంగారం ధర తగ్గే అవకాశాలు ఉండొచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అంతరాయం కలిగించకుండా ఉండేందుకు.. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలనే చూస్తుండగా మరోవైపు ట్రంప్.. ఈ వడ్డీ రేట్లను తగ్గించాలని ఎప్పటినుంచో ఒత్తిడి చేస్తున్నారు. చివరిసారిగా ఫెడ్ జనవరిలో వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచింది. దానికి ముందు వరుసగా 3 సమీక్షల్లో 50, 25, 25 బేసిస్ పాయింట్ల చొప్పున 100 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించగా.. బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. మరి ఇప్పుడైనా తగ్గుతాయేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com