ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పిన్నర్లపై భజ్జీ సెటైర్లు.. మీరేం ఫాస్ట్ బౌలర్లు కాదు!

sports |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 08:01 PM

టీ20ల్లో స్పిన్నర్ల తీరుపై హర్భజన్ సింగ్ కాస్తంత కోప్పడ్డారు. ఐపీఎల్ 2025 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ మాజీ స్పిన్నర్ ఘాటుగా విమర్శలు చేశాడు. స్పిన్నర్లు అసలు వికెట్లు తీయడమే మరచిపోయారని సెటైర్లు వేశాడు. ఇప్పుడున్న కొత్త జనరేషన్ స్పిన్‌లో కూడా ఫాస్ట్ బౌలింగ్ ఎందుకు వేస్తున్నారో తెలియడం లేందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.


టీ20 క్రికెట్‌లో పిచ్‌లన్నీ బ్యాటింగ్‌కు అనుకూలించే విధంగానే ఉంటాయి.. అలాంటి సమయంలోనే స్పిన్నర్లు వారిని అడ్డుకోవాలని భజ్జీ చెప్పాడు. కానీ వాళ్లు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడమే మరచిపోయారని అన్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన రషీద్ ఖాన్ కూడా వైట్ బాల్ క్రికెట్‌లో వికెట్లు తీయడానికి చాలా కష్టపడుతున్నాడని హర్భజన్ చెప్పాడు. స్పిన్నర్లు అటాకింగ్ మైండ్‌సెట్‌ను అలవరుచుకోవాలని సూచించాడు.


"నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. టీ20లు లేదా ఐపీఎల్‌లో చాలా మంది స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్లలా వ్యవహరిస్తున్నారు. వాళ్లెవ్వరూ బంతిని తిప్పడం లేదు. వాళ్లంతా వికెట్లు తీయడం పక్కనే పెట్టి కేవలం అటాకింగ్ మాత్రమే చేస్తున్నారు. వాళ్లు బంతిని తిప్పాలి, మ్యాచ్‌లో ఛాన్స్ తీసుకుని వికెట్ తీయాలి" అని హర్భజన్ సింగ్ నేషనల్ మీడియాతో అన్నాడు.


బీసీసీఐ తొలగించిన ఓ నిబంధనను హర్భజన్ సింగ్ స్వాగతించాడు. అది బౌలర్లకు చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాడు. "బంతికి సలైవా వాడకం బౌలర్లకు కలిసొచ్చే అంశం. త్వరలోనే దీన్ని ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా చూస్తాం. సలైవాతో బంతి ఒకవైపు షైన్ అవుతుంది. దాంతో పేసర్లకు స్వింగ్‌కు అనుకూలించడమే కాకుండా, స్పిన్నర్లకూ లాభం చేకూరుస్తుంది" అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.


ఐపీఎల్ 2025లో ఎమర్జింగ్ ప్లేయర్ మాత్రం రియాన్ పరాగే అవుతాడని హర్భజన్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఈ ఐపీఎల్‌లో ఎంతో మంది యంగ్‌స్టర్స్ ఉన్నప్పటికీ తన కళ్లు మాత్రం పరాగ్ మీదకే వెళ్తున్నాయని చెప్పాడు. ఇతని కెప్టెన్సీలోనే అసోం అద్భుతంగా రాణించిందని గుర్తు చేశాడు. అతని టాలెంట్ అద్భుతమని, త్వరలోనే అతని ఎదుగుదలను అందరూ చూస్తారని చెప్పాడు. రియాన్ పరాగే కాకుండా యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, అభిషేక్ శర్మ వీళ్లంతా ఫ్యూచర్ ఇండియా అని చెప్పాడు. వీళ్లతో పాటు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ 2025లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com