ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సన్‌రైజర్స్‌కు భలే ఛాన్స్ మిస్.. లేకపోతే మరోలా

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 08:03 PM

గత ఐపీఎల్ సీజన్లో విధ్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థులను హడలెత్తించి.. అభిమానులను ఉర్రూతలూగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2025 సీజన్‌ను గ్రాండ్‌గా ఆరంభించింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మార్చి 23న జరుగుతున్న మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ అదరగొట్టింది. ఇషాన్ కిషన్ అజేయ సెంచరీకి మిగతా బ్యాటర్ల మెరుపులు తోడు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.


ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 2024 ఏప్రిల్ 15న చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. రాజస్థాన్‌పై 286 రన్స్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. తన రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం ఒక్క బంతి దూరంలో ఆగిపోయింది.


తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో.. తొలి బంతికి సిక్స్ కొట్టిన కొత్త కుర్రాడు అనికేత్ వర్మ.. రెండో బంతికి ఔటయ్యాడు. మూడో బంతికి అభినవ్ మనోహర్ సైతం భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఈ రెండు బంతులు వేస్ట్ కాకుండా.. కనీసం సింగిల్ వచ్చినా సన్‌రైజర్స్ కచ్చితంగా తన హయ్యెస్ట్ టోటల్ రికార్డును బ్రేక్ చేసేదే. కానీ తుషార్ రాజస్థాన్ పరువు కాపాడాడు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అభిమానులు సైలెంట్ అయిపోయిన సందర్భం ఏదైనా ఇదొక్కటే. అయితే ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ కమిన్స్.. తుషార్‌కు హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ చేశాడు. సన్‌రైజర్స్ బ్యాటర్ల విధ్వంసంలోనూ.. తుషార్ 4 ఓవర్లలో 44 పరగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో హెడ్ వికెట్ కూడా ఉంది.


ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తన హయ్యెస్ట్ స్కోర్ రికార్డును తాను బ్రేక్ చేయలేకపోవచ్చు గానీ.. ఇదే ఆటతీరు కొనసాగిస్తే.. కచ్చితంగా 300 పరుగుల మార్క్‌ను అందుకోవచ్చు. ఇప్పటికైతే.. ఐపీఎల్ సీజన్లో టాప్-3 హయ్యెస్ట్ స్కోర్లు ఆరెంజ్ ఆర్మీ పేరిటే ఉన్నాయి. 2024 మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


గత ఐపీఎల్ ఫైనల్లో సన్‌రైజర్స్‌ను ఓడించి కప్ ఎగరేసుకుపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్.. 2018 సీజన్లో పంజాబ్‌పై 5 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో ఇది నాలుగో హయ్యెస్ట్ స్కోరు‌గా ఉంది. అంతకు ముందు 2013 సీజన్లో పుణే వారియర్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 263 రన్స్ చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఐదో హయ్యెస్ట్ స్కోరు. సన్‌రైజర్స్ 2024 సీజన్ ఆటను రెప్లికేట్ చేస్తే.. ఆర్సీబీ రికార్డు టాప్-5 నుంచి టాప్-10లోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com