సీజన్ మారింది.. ప్లేయర్లు మారారు.. కానీ సన్రైజర్స్ జట్టు ఆటేం మారలేదు. కిందటేడాది క్రికెట్ చరిత్రలోనే సరికొత్త విధ్వంసాన్ని పరిచయం చేసిన హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. అదే ఆటతీరుతో ఐపీఎల్ 18వ సీజన్ను కూడా మొదలెట్టేసింది. అసలే హోం గ్రౌండ్.. ఆపై తొలుత బ్యాటింగ్.. వేరే జట్టు సంగతేమో కానీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే. గత సీజన్లో తొలుత బ్యాటింగ్ చేసి 3 సార్లు 250కిపైగా స్కోరు చేసిన హైదరాబాద్.. ఐపీఎల్లోనే అత్యధిక స్కోరు 287 ఆర్సీబీపై నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ తెలిసి కూడా రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ 18వ సీజన్లో తమ తొలి మ్యాచ్లో టాస్ గెలిచి సన్రైజర్స్కు బ్యాటింగ్ అప్పగించింది. ఊరుకుంటారా.. ఊచకోత కోసేశారు. తొలి బంతి నుంచి బాదడమే పనిగా పెట్టుకున్న హైదరాబాద్.. భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. వరుసగా 287, 286, 277 ఇలా మూడు స్కోర్లు ఎస్ఆర్హెచ్వే కావడం విశేషం. గ్రౌండ్లోకి దిగిన ప్రతి ఒక్క బ్యాటరూ హిట్టింగే చేశాడు. ఈసారి వేలంలో హైదరాబాద్కు మారిన ఇషాన్ కిషన్ శతకంతో విజృంభించాడు. అతడికి ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ.
తొలుత టాస్ గెలిచిన రాయల్స్ మరోమాటే లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. అది తప్పని తెలిసేందుకు ఎంతో సేపు పట్టలేదు. విధ్వంసకర ఓపెనర్లు.. అభిషేక్ శర్మ, హెడ్ ఆది నుంచే విరుచుకుపడ్డారు. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో ఫరూకీకి అభిషేక్ స్వాగతం పలకగా.. రెండో ఓవర్లో తీక్షణకు తన హిట్టింగ్ రుచి చూపించాడు హెడ్. 3వ ఓవర్లో ఫరూకీ బౌలింగ్లో 21 పరుగులు పిండుకోగా.. తర్వాత జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో హెడ్ 4 ఫోర్లు, సిక్సర్ బాదాడు. తర్వాత అభిషేక్ (24) అవుటైనా.. హెడ్ ఆగలేదు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ దాటగా.. 31 67 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి మ్యాజిక్ మొదలైంది.
ఆరంభంలో ఎక్కువగా ఫోర్లు బాదిన ఇషాన్.. జోఫ్రా వేసిన 13వ ఓవర్లో 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్లో నితీశ్ రెడ్డి ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్తో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత కూడా ఇషాన్ ఫోర్లు, సిక్సర్లతో వేగంగా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్లాసెన్ కూడా ఆఖర్లో 14 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఇషాన్.. సందీప్ శర్మ బౌలింగ్లో రెండు వరస సిక్సర్లు బాది తర్వాతి బంతికే కేవలం 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
రైజర్స్ బ్యాటర్ల విధ్వంసానికి.. రాయల్స్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది చెత్త రికార్డు. గతేడాది మోహిత్ శర్మ.. 73 రన్స్ ఇవ్వడం వరస్ట్ రికార్డుగా ఉండగా.. ఇప్పుడు ఆర్చర్ అతడ్ని అధిగమించాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. అందరిలో తుషార్ దేశ్పాండే కాస్త బెటర్. 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తీక్షణ కూడా 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. గతేడాది అదరగొట్టిన సందీప్ శర్మ కూడా తేలిపోయాడు. 4 ఓవర్లలో 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఫరూకీ 3 ఓవర్లలోనే 49 పరుగులు ఇచ్చాడు.
![]() |
![]() |