ఐపీఎల్ 2025లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోర్ చేసింది. సీఎస్కే హోం గ్రౌండ్లో ఆర్సీబీ 200 పరుగులను మిస్ చేసుకుంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్కి వచ్చింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్తో పాటు కెప్టెన్ రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ, ఆఖర్లో టిమ్ డేవిడ్ బౌండరీలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ 16 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్తో 32 పరుగులు చేయగా, విరాట్ కోహ్లి 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పటిదార్ క్రీజులో నిలదొక్కుకొని 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడ సిక్సర్లతో 51 పరుగులు చేసి పతిరణ బౌలింగ్లో అవుటయ్యాడు. లివింగ్స్టన్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా వెంటవెంటనే అవుటయ్యారు. టిమ్ డేవిడ్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో ఆర్సీబీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డేవిడ్ ఎనిమది బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 22 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఆఖర్లో మ్యాజిక్
సీఎస్కే స్పెషలిస్ట్ బౌలర్ మతీషా పతిరణ 19వ ఓవర్లో తన స్వింగ్తో ఆర్సీబీ బ్యాటర్లకు చుక్కలు చూపెట్టాడు. 19వ ఓవర్ మొదటి బంతికే కెప్టెన్ పటిదార్ను పెవలియన్కు పంపిన పతిరణ, వరుసగా రెండు బంతులను డాట్ చేసి ఆ తర్వాత బంతిని వైడ్గా వేశాడు. నాలుగో బంతిని గాల్లోకి లేపిన కృనాల్ పాండ్యా పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ మిగతా రెండు బంతులను డాట్ చేశాడు. దాంతో ఆ ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు ఓవర్లు వేసి 37 పరుగులు సమర్పించుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండు ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకోగా, ఖలీల్ అహ్మద్ నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. సామ్ కరన్ మూడు ఓవర్లలో వికెట్లు ఏమీ తీయకుండా 34 పరుగులు ఇచ్చాడు. నూర్ అహ్మద్ నాలుగు ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా.. పతిరణ నాలుగు ఓవర్లలో 36 పరుగులతో రెండు వికెట్లు పడగొట్టాడు.
![]() |
![]() |