పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) భారతదేశంలోని దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడి ఎంపికలలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కీమ్లలో ఒకటి. ఇది ప్రస్తుతం సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది పూర్తిగా పన్ను రహితం. అంటే ఇక్కడ ట్రిపుల్ టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. పెట్టుబడి, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ రిటర్న్స్పై టాక్స్ ఉండదు. ఇంకా ఆర్థిక సంవత్సరంలో.. పాత పన్ను విధానం కింద సెక్షన్ 80c ప్రకారం గరిష్టంగా రూ. 1.50 లక్షలు పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే.. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో ఎక్కువ వడ్డీ సంపాదించడానికి ఒక చిన్న ట్రిక్ గురించి చాలా మందికి తెలియదు. అదే ఏప్రిల్ 5కు ముందు డబ్బులు డిపాజిట్ చేయడం గురించి
అవును ఈ సింపుల్ ట్రిక్తో మీరు కాస్త ఎక్కువ వడ్డీ పొందొచ్చు. ఇంకా దీనిపై టాక్స్ పడదు. అప్పుడు మొత్తం మెచ్యూరిటీ సమయంలో మీరు ఎక్కువ రాబడి పొందొచ్చు. దీని గురించి తెలుసుకుందాం.
పీపీఎఫ్ రూల్..
పీపీఎఫ్లో వడ్డీ ప్రతి నెలా లెక్కిస్తారు. ఇది ఆర్థిక సంవత్సరం చివరిలో (మార్చి 31) ఖాతాకు జమ అవుతుంది. ఒక నెలలో వడ్డీ లెక్కింపు ఆ నెల 5వ తేదీ నుంచి నెల చివరి వరకు ఉన్న అతి తక్కువ బ్యాలెన్స్ ఆధారంగా జరుగుతుంది. అందుకే, ఏప్రిల్ 5 ముందు మీ సంవత్సరపు డిపాజిట్ (గరిష్ఠంగా రూ.1.5 లక్షలు) చేస్తే, ఆ మొత్తంపై పూర్తి 12 నెలల వడ్డీ లభిస్తుంది. ఒకవేళ ఏప్రిల్ 5 తర్వాత డిపాజిట్ చేస్తే, ఏప్రిల్ నెల వడ్డీ కోల్పోతారు. దీని వల్ల మీ మొత్తం రాబడిపై ప్రభావం పడుతుంది.
ఎంత అదనపు వడ్డీ సంపాదించవచ్చు?
లంప్సమ్ డిపాజిట్ ఉదాహరణ: మీరు ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షలు ఏప్రిల్ 5 ముందు డిపాజిట్ చేస్తే, 7.1 శాతం వడ్డీ రేటుతో 15 సంవత్సరాల్లో రూ. 21.17 లక్షల వడ్డీ సంపాదిస్తారు, మెచ్యూరిటీ మొత్తం రూ. 45.17 లక్షలు అవుతుంది. కానీ, ఏప్రిల్ 15న డిపాజిట్ చేస్తే, రూ. 20.92 లక్షల వడ్డీ మాత్రమే వస్తుంది, మెచ్యూరిటీ మొత్తం రూ. 44.92 లక్షలు అవుతుంది. అంటే, రూ.25,000 అదనపు వడ్డీ కోల్పోతారు.
నెలవారీ డిపాజిట్ ఉదాహరణ: నెలకు రూ.12,500 (సంవత్సరానికి రూ.1.5 లక్షలు) ప్రతి నెల 5వ తేదీ ముందు డిపాజిట్ చేస్తే, 15 సంవత్సరాల్లో రూ.19.80 లక్షల వడ్డీ లభిస్తుంది. కానీ, ప్రతి నెల 10వ తేదీ తర్వాత డిపాజిట్ చేస్తే, రూ. 19.55 లక్షల వడ్డీ మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ రూ. 24,958 నష్టం వస్తుంది.
![]() |
![]() |