ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుచ్చకాయ తిన్న తర్వాత తొక్కల్ని పారేయకండి

Life style |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 11:21 PM

వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. పుచ్చకాయల దాదాపు 90 శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇప్పటికే మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా లభిస్తున్నాయి.. పుచ్చకాయలో విటమిన్‌ ఏ, బీ కాంప్లెక్స్‌, సీ, పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయి. వీటితో పాటు.. పుచ్చకాయలోని లైకోపీన్‌, బీటా - కెరోటిన్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుంది.


అయితే, చాలా మంది పుచ్చకాయ తిన్న తర్వాత వాటి తొక్కల్ని పారేస్తుంటారు. కానీ పుచ్చకాయ లాగే దాని తొక్క కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది చాలా విషయాలకు ఉపయోగపడుతుంది. పుచ్చకాయ తొక్కల్ని మొక్కలకు ఎరువుగా వాడవచ్చంటున్నారు నిపుణులు. పుచ్చకాయ తొక్కలతో మొక్కలకు పూలు బాగా పూస్తాయని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయ తొక్కలతో ఎరువు ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.


పుచ్చకాయ తొక్కలతో ఎరువు కోసం కావాల్సిన పదార్థాలు


* పుచ్చకాయ తొక్కలు


* బెల్లం


* ఆవు పేడ లేదా ఆవు పేడ ఎరువు


* ఒక లీటర్ నీరు


ద్రవ ఎరువు ఎలా తయారు చేయాలి?


ద్రవ ఎరువును తయారు చేయడానికి, ముందుగా పుచ్చకాయ తొక్కలను చిన్న ముక్కలుగా కోయండి. ఇప్పుడు ఒక బకెట్ లో నీళ్ళు తీసుకుని ఈ తొక్క ముక్కలను అందులో వేయండి. దీనితో పాటు, బకెట్‌లో కొంచెం బెల్లం, ఆవు పేడ ఎరువు వేసి బాగా కలపాలి. ఇప్పుడు బకెట్‌ని మూతతో కప్పి ఉంచండి. మూతతో కప్పిన తర్వాత, 5-7 రోజులు ఇలాగే ఉంచండి. దుర్వాసన రాకుండా ఉండటం కోసం ప్రతి రోజూ దాన్ని కలుపుతూ ఉండండి.


మొక్కలకు ఎలా ఉపయోగించాలి?


నిర్ణీత సమయం తర్వాత, అంటే 5-7 రోజుల తర్వాత.. పైన పెట్టిన మూతను తీసివేయండి. ఆ తర్వాత ద్రవ ఎరువు సిద్ధంగా ఉందని అర్థం చేసుకోండి. ఈ ద్రవ ఎరువును ఫిల్టర్ చేయండి. కేవలం నీరు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఈ ద్రవ ఎరువును నీటి సేద్యంలా మొక్కలకు పోయవచ్చు. ఈ ద్రవ ఎరువును 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ కారణంగా పూలు బాగా పోస్తాయి. అందుకే ఈ మిశ్రమాన్ని పూల మొక్కలకు వాడుకోవచ్చు. అయితే, ఈ ద్రవ ఎరువును తక్కువ మోతాదులో వాడండి. ఎక్కువగా వాడితే మొక్కల వేళ్లు కుళ్లిపోయే ప్రమాదముంది.


మొక్కలకు వీటిని కూడా ట్రై చేయండి


* గుడ్డు పెంకులు: చాలా మంది గుడ్డు పెంకుల్ని అనవసర వస్తువుగా భావించి పారేస్తుంటాం. అయితే, గుండు పెంకుతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల్లో ఉండే పోషకాల లోపాన్ని తీర్చడానికి గుడ్డు పెంకులను కూడా ఉపయోగించవచ్చు. గుడ్డు పెంకుల్లో కాల్షియం, పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కలకు ఎంతగానో సహకరిస్తాయి. ఈ పోషకాలు మొక్కలు పెరగడానికి, పువ్వులు వికసించడానికి తోడ్పడతాయి. ఇందుకోసం ముందుగా గుడ్డు పెంకులను మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని నీళ్లలో కలిపి గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత ద్రావణాన్ని వడపోసి మొక్కపై పిచికారీ చేయాలి.


* వేప నూనె: పురుగుల నుంచి పువ్వులను రక్షించడానికి, వేప నూనెతో పిచికారీ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక సీసాలో 2-3 చుక్కల వేపనూనె వేసి, ఇప్పుడు ఒక లీటరు నీరు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి మొక్కలపై పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫంగస్‌తో పాటు కీటకాలు కూడా వదిలిపోతాయి. ఈ ద్రావణాన్ని వారానికి ఒకసారి మొక్కల ఆకులు, కాండాలపై పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల బాగా పువ్వులు వికసిస్తాయి.


ఈ విషయాలు ముఖ్యం


మొక్కలు పుష్పించకపోవడానికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. మొక్కలకు సరైన సూర్యకాంతి, నీరు, నేల,ఎరువులు అందుతున్నాయా లేదా అనే దానిపై శ్రద్ధ వహించండి. మొక్కలు కొనుగోలు చేసేటప్పుడు వాటి సంరక్షణకు సంబంధించిన విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. మొక్కల మట్టిని కలుపు తీయడం, ఎప్పటికప్పుడు మట్టిని మార్చడం వంటి పనులు చేయాలి. అలాగే, నెలకో సారి మొక్కలకు ఎరువులు వేయాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com