ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో ,,,టీటీడీ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 04:34 PM

తిరుమల శ్రీవారి దర్శనం నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో సామాన్యులతో పాటుగా వీవీఐపీలు కూడా ఉంటారు. ఇక ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో కూడా కొంతమంది శ్రీవారి దర్శనానికి కోసం తిరుమలకు వస్తుంటారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలతో తిరుమలకు వచ్చే భక్తులకు ముఖ్య గమనిక. ఇలా సిఫారసు లేఖలో శ్రీవారి బ్రేక్ దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గదులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గదుల కేటాయింపు విధానాన్ని టీటీడీ సులభతరం చేసింది.


సిఫారసు లేఖలతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వసతి గదులు కావాలంటే.. తమకు సిఫారసు చేసిన వారి ధ్రుపపత్రాలు, జిరాక్స్ కాపీని వెంట తీసుకురావాల్సి వచ్చేది. ఈ జిరాక్స్ కాపీ మీద టీటీడీ ఈవో ఆఫీస్ సిబ్బంది స్టాంపింగ్ చేసి గదులు కేటాయించేవారు. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టేది. అలాగే ఎక్కువ సేపు క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. అయితే ఈ విధానంలో టీటీడీ స్వల్ప మార్పులు చేసింది. సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు దర్శన ఎన్‌రోల్‌మెంట్‌ స్లిప్‌పైనే ఇకపై తిరుమలలో వసతి గదులు కేటాయించనున్నారు. ఈ విధానాన్ని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో ప్రారంభించారు. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి శనివారం ఈ ప్రక్రియను ప్రారంభించారు.


సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వసతి గదుల కోసం.. దర్శన ఎన్‌రోల్‌మెంట్‌ స్లిప్‌ తీసుకుని గదుల కేటాయించే సెంటర్ల వద్దకు వెళ్లాలి. అక్కడి సిబ్బంది స్కానింగ్‌ చేసిన అనంతరం నేరుగా గదులు కేటాయిస్తారు. ఈ విధానం వలన క్యూలైన్లలో నిల్చునే ఇబ్బంది తప్పుతుందని టీటీడీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీవారిని శనివారం 72,923 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,571 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీకి 3.33 కోట్ల ఆదాయం వచ్చింది. మరోవైపు సర్వదర్శనం కోసం 18 నుంచి 20 గంటల వరకూ సమయం పట్టినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com