తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా పాకాల మండలంలోని తోటపల్లి వద్ద కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపైన ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు.. అదుపు తప్పి ముందు వెళ్తున్న కంటైనర్ ఢీకొని, దాని కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. బాధితులు అందరూ తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని సంక్రాంతిపల్లెలో శనివారం వరుస చోరీలు జరిగాయి. శనివారం అర్ధరాత్రి వరుసగా ఐదిళ్లలో దొంగలు పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతిపల్లెకు చెందిన ఓమేష్, అతడి కుటుంబం శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి మిద్దెపై నిద్రపోతున్నారు. ఈ సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న బీరువాను ఇంటికి దూరంగా తీసుకెళ్లిన దొంగలు.. బీరువా పగలగొట్టి అందులోని 50 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న రాము అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాను దూరంగా తీసుకెళ్లి.. అందులోని 23 గ్రాముల బంగారు నగలను చోరీ చేశారు. ఆ తర్వాత సంక్రాంతిపల్లె ఎస్సీ కాలనీలోకి చొరబడ్డారు. ఎస్సీ కాలనీలోని మూడు ఇళ్లకు తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు. వీరి ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అయిత వారి ఇంట్లో విలువైన వస్తువులు దొరక్కపోవడంతో వట్టి చేతులతో వెనుదిరిగారు. ఉదయాన్నే చోరీలు జరిగిన విషయాన్ని గుర్తించిన ఇళ్ల యజమానులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేలిముద్ర నిపుణుల సాయంతో ఆధారాలు సేకరించారు. దొంగలను కనిపెట్టే పనిలో పడ్డారు.
![]() |
![]() |